
నార్కట్ పల్లి : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 80 స్థానాలు వస్తాయని.. దీంతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు దగ్గర మాట్లాడుతూ ఈ మేరకు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఆయన జన్మదినం సందర్భంగా.. కార్యకర్తల నడుమ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు దగ్గర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.
రాబోయే ఎన్నికల్లో తనను ప్రజలు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు రాకుంటే తాను రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. తమ పార్టీలో వర్గ పోరు లేదని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఖర్గేలు ఈనెల 26న ముఖ్య నాయకులతో సమావేశం అవుతున్నారని చెప్పుకొచ్చారు.
హైద్రాబాద్లో మరోసారి ఐటీ సోదాలు: కోహినూర్ డెవలర్స్ సంస్థలో తనిఖీలు
ఆ తర్వాత నల్గొండలో పది రోజుల్లో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల కోసం తాను మంత్రి పదవిని కాదని ఆనాటి సీఎం వైఎస్ తో శంకుస్థాపన చేయించానని గుర్తు చేశారు. ఈ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతుండగా ఆయన అభిమానులు సీఎం సీఎం అని నినాదాలు చేశారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ నన్ను అలా అనొద్దు. మీరు అభిమానంతో అలా అంటే అందరూ కలిసి నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తారు’ అని వారించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి లింగమయ్య లకు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు.