తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ చేపట్టిన దీక్షను మంగళవారం నాడు పోలీసులు భగ్నం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ చేపట్టిన దీక్షను మంగళవారం నాడు పోలీసులు భగ్నం చేశారు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబులెన్స్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీతక్క అరెస్ట్ చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తులు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. ఎమ్మెల్యే సీతక్క ఆరోగ్యం క్షీణించడంతోనే దీక్షను భగ్నం చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు.
రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలని సీతక్క డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాను ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది. వెయ్యి రూపాయాలు దాటితే ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రభుత్వమే ఈ ఫీజులను భరిస్తోంది. అయితే తెలంగాణలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే డిమాండ్ తో ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టారు. సీతక్క ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను భగ్నం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.