
BJP MP Arvind Dharmapuri: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రగడ మొదలైంది. ఈ క్రమంలోనే కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ ఎంపీ ఇంటిని పలువురు ముట్టడించారు. ఇంటిలోని పలువస్తువులను పగులగొట్టారు. ఈ చర్యలకు పాల్పడిన దాదాపు 50 మందిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్లోని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంట్లోకి ఒక గుంపు ప్రవేశించి ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేసింది. ఇదే విషయం గురించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మపురి అరవింద్ తల్లి విజయలక్ష్మి సాయంత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సెక్షన్ 148 (అల్లర్లు, మారణాయుధాలతో దాడులు), 149(సాధారణ వస్తువును ప్రాసిక్యూషన్ చేయడంలో చట్టవిరుద్ధమైన సమావేశానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడ), 452 (గాయపర్చడం, దాడి లేదా తప్పుడు నిర్బంధానికి సిద్ధమైన తర్వాత ఇంటిని అతిక్రమించడం)సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వీటితో పాటు భారతీయ శిక్షాస్మృతి (IPC) , 323, 427, 354 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటివరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
టీఆర్ఎస్ నేతల దాడి, నిరసనలతో బంజారాహిల్స్లో ఉద్రిక్తత నెలకొంది. దాడి అనంతరం బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఎంపీ నివాసానికి వెళ్లి అక్కడ కలిగిన నష్టాన్ని పరిశీలించారు. సంబంధిత దాడి, పోలీసులు తీసుకున్న చర్యల గురించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు.
అంతకుముందు తన ఇంటిపై జరిగిన దాడిపై ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని కవితకు సవాల్ విసిరారు. ఇంకా దొరల పాలన సాగుతుందని అనుకొంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ లోని తన ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసి మహిళలను భయపెట్టారని, తన తల్లిని బెదిరించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంట్ లో పోటీచేస్తావా చేయాలని కవితకు అరవింద్ సవాల్ చేశారు. విమర్శలు చేస్తే దాడి చేస్తారా? అని అర్వింద్ ప్రశ్నించారు.
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై జరిగిన దాడి ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా స్పందించే సామర్థ్యం వారికి లేకపోవడం వల్లే దాడులు జరిగాయని విమర్శించారు. వారిలా తమ పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగితే తట్టుకోలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఎంపీ అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు.