
క్యాసినో వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఈడీ కార్యాలయం నుంచే ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రెండేళ్ల క్రితం స్టంట్ వేయించుకోవడం, అనంతరం ఈడీ కార్యాలయంలో మూడు అంతస్తుల వరకు మెట్లు ఎక్కడంతో ఎల్ రమణ అలసటకు గురయ్యారు. ఆపై బీపీ హెచ్చుతగ్గులకు గురవుతూ వుండటంతో అనుమానించిన ఈడీ కార్యాలయంలోని భద్రతా సిబ్బంది ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రమణను సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే వున్నట్లుగా తెలుస్తోంది. రమణ ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తర్వాత ఆయనను ఈడీ అధికారులు విచారణకు పిలిచే అవకాశం వుంది.
ALso REad:టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణకు ఈడీ నోటీసులు: విచారణకు రావాలని ఆదేశం
కాగా... ఈ కేసులో రెండు రోజుల క్రితం తలసాని ధర్మేంధ్ర యాదవ్, తలసాని మహేష్ యాదవ్లను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. హవాలా , ఫెమా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనే అనుమానంతో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇదే కేసులో అనంతపురం జల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని ఈడీ అధికారులు నిన్న విచారించారు. ఇవాళ విచారణకు ఎల్. రమణ హాజరయ్యారు. మెదక్ డీసీసీబీ చైర్మెన్ దేవేందర్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
నేపాల్ లో జరిగిన బిగ్ డాడీ అడ్డాలో పేకాట ఆడినవారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టబద్దంగా ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతాలకు వెళ్లి క్యాసినో ఆడిన వారిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చీకోటి ప్రవీణ్ కుమార్ ద్వారా వీరంతా గోవాతో పాటు ఇతర దేశాల్లో క్యాసినో ఆడారని ఈడీ అధికారులు గుర్తించారు. క్యాసినో విషయంలో చెల్లింపులు హవాలా రూపంలో జరిగినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.