
హైదరాబాద్లో నిలోఫర్ ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి వద్ద ప్లాస్టిక్ కవర్లో పసికందును వదిలి వెళ్లారు. ఆస్పత్రి వద్ద ప్లాస్టిక్ కవర్లో పసికందును సిబ్బంది గుర్తించారు. వివరాలు.. ఆటోలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు శిశువు ఉన్న కవర్ను ఆస్పత్రి ముందు ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది.. శిశువును వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. శిశువును పరిశీలించిన వైద్యులు.. జాండిస్, అంగవైకల్యం ఉన్నట్టుగా గుర్తించారు.
ఈ కారణంతోనే శిశువును ఆస్పత్రి వద్ద వదిలి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆస్పత్రి వద్ద శిశువు వదిలివెళ్లిన వారిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆసుపత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆటోలో వచ్చిన వారు ఎవరనేది గుర్తించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు.