నగరంలో ఆదివారం 24గంటలపాటు ట్రాఫిక్ ఆంక్షలు

By ramya neerukondaFirst Published Sep 21, 2018, 11:08 AM IST
Highlights

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆన్‌లైన్‌ పద్ధతిలో 14,500 గణేశ్‌ మండపాలకు అనుమతి తీసుకోగా... అనధికారికంగా అంతే సంఖ్యలో విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు అంచనా వేస్తున్నామన్నారు. 

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. శోభాయాత్రలు కొనసాగే మార్గాల్లో జీహెచ్‌ఎంసీ, విద్యుత్తు, జలమండలి, రహదారులు-భవనాల శాఖల భాగస్వామ్యంతో అవసరమైన సన్నాహాలు చేపట్టినట్లు అంజనీకుమార్‌ వివరించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆన్‌లైన్‌ పద్ధతిలో 14,500 గణేశ్‌ మండపాలకు అనుమతి తీసుకోగా... అనధికారికంగా అంతే సంఖ్యలో విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు అంచనా వేస్తున్నామన్నారు. 

నిమజ్జనం రోజు 25వేల విగ్ర నుంచి 30వేల విగ్రహాల వరకు హుస్సేన్‌సాగర్‌కు తరలిరానున్నాయన్నారు. నిమజ్జన వేడుకకు  45 రోజుల ముందు నుంచే సన్నాహాలు మొదలుపెట్టామని రెండు, మూడు సార్లు సంయుక్తంగా ఊరేగింపు మార్గమంతా పరిశీలించామన్నారు. మొహర్రం మాతం శుక్రవారం జరగనుందని, ఇందుకు పాతబస్తీ, తూర్పుమండలం పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు.  ఆదివారం ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో  నిమజ్జనాన్ని చూసేందుకు 12లక్షల మంది ప్రజలు వస్తారన్న అంచనాతో చర్యలు చేపట్టామని వివరించారు.

నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని అంజనీ కుమార్‌ తెలిపారు. నేను సైతం పేరుతో ప్రజలు ఏర్పాటు చేసిన 2.38లక్షల కెమెరాలకు అదనంగా మరో 12వేల కెమెరాలను కలుపుకొని 2.50లక్షల సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేశామన్నారు. ప్రతి విగ్రహానికి జియోట్యాగింగ్‌ చేశామని, బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకు మొత్తం 18 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేకంగా 450 కెమెరాలను అమర్చామన్నారు.  ప్రక్రియ వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేకంగా కొక్కేలను క్రేన్లకు అమర్చనున్నామని చెప్పారు. విగ్రహం నీటిని తాకగానే... పైనున్న కొక్కెం దానంతటదే విడిపోతుందని, ఈ ప్రక్రియతో గంటకు 25 విగ్రహాలు నిమజ్జనం చేయవచ్చన్నారు.

click me!
Last Updated Sep 21, 2018, 11:08 AM IST
click me!