హుజురాబాద్ ఉపఎన్నికకు మరో నెలరోజుల సమయంమాత్రమే వుందనగా బిజెపికి షాకిచ్చారు కరీంనగర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి. ఈమెతో పాటు హుజురాబాద్ పట్టణ మహిళామోర్చా అధ్యక్షురాలు మంజుల మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక (Huzurabad Bypoll) షెడ్యూల్ వెలువడడంతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే భారీగా వలసలను ప్రోత్సహిస్తూ ఈటల రాజేందర్ (Eatala Rajender)ను బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్న అధికార టీఆర్ఎస్ (TRS) తాజాగా మరో షాకిచ్చింది. బిజెపి(BJP)కి జిల్లా స్థాయి మహిళా నాయకురాలు బిజెపికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని కారెక్కారు కరీంనగర్ బిజెపి మహిళా అధ్యక్షురాలు ఈదులకంటి రమాదేవి.
హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే హుజురాబాద్ లో మకాం వేసిన మంత్రి హరీష్ బిజెపి, ఈటలను దెబ్బతీసే ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా బిజెపి మహిళా ఉపాధ్యక్షురాలు రమాదేవితో పాటు హుజురాబాద్ పట్టణ మహిళామోర్చ అధ్యక్షురాలు ఈదులకంటి మంజులను టీఆర్ఎస్ గూటికి వచ్చేలా పావులు కదిపారు.
Video Huzurabad Bypoll:ఈటలకు చేధుఅనుభవం... బూతులుతిడుతూ దుమ్మెత్తిపోసిన దంపతులు
మంత్రి హరీష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్ లో చేరిన మహిళా నాయకులు మాట్లాడుతూ... ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల కోసం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేంద్రం నిబంధనలు విధించిందన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తోందన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితి ఐదేళ్లు సడలించిందన్నారు. అలాగే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు స్పష్టమైన హామీ ఇచ్చినందునే బీజేపీకి రాజీనామా చేసి టీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం కోసం తాము పనిచేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ లో విజయం సాధించడం ఖాయమని రమాదేవి, మంజుల ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడింది. అక్టోబర్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ (election notification) విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. నవంబర్ 2న కౌంటింగ్ (counting)నిర్వహిస్తారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ఇంకా ఖరారు చేయలేదు.