Huzurabad Bypoll: ఈటలకు షాక్... బిజెపిని వీడి టీఆర్ఎస్ లో చేరిన హుజురాబాద్ కౌన్సిలర్

By Arun Kumar PFirst Published Oct 5, 2021, 2:28 PM IST
Highlights

హుజురాబాాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి పొలిటికల్ హీట్ మరింత పెరిగిన సమయంలో బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్ బిజెపి కౌన్సిలర్ మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. 

కరీంనగర్:  హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad bypoll) గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష బిజెపికి షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. ఇప్పటివరకు మాజీమంత్రి ఈటల రాజేందర్ (eatala rajender) వెంట టీఆర్ఎస్ (trs) నుండి బిజెపి (bjp)లోకి చేరినవారిని సొంతగూటికి తీసుకురావడం కోసం మంత్రులు గంగుల కమలాకర్ (gangula kamalakar), హరీష్ రావు ప్రయత్నించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బిజెపి నాయకులు, ప్రజా ప్రతినిధులను కూడా టీఆర్ఎస్ లోకి లాగుతున్నారు. ఇలా భారీగా వలసలను ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేస్తూ గెలుపు అవకాశాలను మెరుగుపర్చకుంటున్నారు.  

ఈ క్రమంలోనే తాజాగా బిజెపికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నేడు(మంగళవారం) హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ గనిశెట్టి ఉమామహేశ్వర్ తో పాటు ముఖ్య అనుచరులు మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

ఆ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ... హుజురాబాద్  నియోజకవర్గంలో బిజెపి పార్టీ పరిస్థితి రోజురోజుకు మసకబారుతుందన్నారు. తెలంగాణలో బిజెపి పార్టీకి స్థానం లేదని గ్రహించడమే కాదు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆ పార్టీ నాయకులు టీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు బిజెపి నాయకులు క్యూ కడుతున్నారని మంత్రి గంగుల పేర్కొన్నారు. 

READ MORE  Huzurabad Bypoll: పోలీసుల ముమ్మర తనిఖీలు... కారులో తరలిస్తుండగా పట్టుబడ్డ నగదు

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి గత శుక్రవారం(అక్టోబర్ 1వ తేదీన) ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఇదేరోజు నుండి నామినేషన్ స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఇదే స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విద్యార్థిసంఘం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్‌ (వెంకట నర్సింగరావు) బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.
 

click me!