భార్యభర్తల మధ్య సర్పంచ్ ఎన్నిక గొడవ: భార్య బలవన్మరణం

By Nagaraju TFirst Published Jan 13, 2019, 8:43 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. సర్పంచ్ అవ్వాలన్న భర్త పదవీ వ్యామోహం భార్య ప్రాణాలను బలితీసుకుంది. సర్పంచిగా పోటీ చేయాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త వేధించడంతో భార్య బలవన్మరణానికి పాల్పడింది. 

నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. సర్పంచ్ అవ్వాలన్న భర్త పదవీ వ్యామోహం భార్య ప్రాణాలను బలితీసుకుంది. సర్పంచిగా పోటీ చేయాలంటూ ఒత్తిడి చేయడంతోపాటు రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త వేధించడంతో భార్య బలవన్మరణానికి పాల్పడింది. 

ఈఘటన నల్గొండ జిల్లా డిండి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నిజాంనగర్‌కు చెందిన భైరాపురం మీనయ్య-శారద దంపతుల కుమార్తె రాధ(22)ను అదే మండలం ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగమయ్యకి ఇచ్చి ఎనిమిది నెలల క్రితం వివాహం చేశారు. 

పెళ్లి సంబంధం కుదుర్చుకున్నప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం లింగయ్యకు ద్విచక్ర వాహనం ఇవ్వాల్సి ఉంది. దానికోసం రాధను భర్త లింగమయ్య తరచూ వేధింపులకు గురిచేసే వాడు. ఆ వేధింపులను ఎలాగోలా భరిస్తూనే ఉంది రాధ. 

ఇంతలో తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల సైరన్ మోగింది. ఎర్రగుంటపల్లి  సర్పంచి పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో రాధను సర్పంచ్ గా పోటీ చెయ్యాలంటూ లింగయ్య ఒత్తిడి పెంచడాు. అంతేకాదు ఎన్నికల ఖర్చు నిమిత్తం పుట్టింటి నుంచి రూ.5 లక్షలు తీసుకురావాలని ఆర్డర్ వేశాడు. 

దీంతో దిక్కుతోచని స్థితిలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తన భర్త డిమాండ్లను తల్లిదండ్రుల దగ్గర పెట్టింది. అయితే తాము ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తేగలమని చేతులెత్తేశారు. దీంతో పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో రాధా పురుగు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  

రాధ పురుగులు మందు తాగడాన్ని గమనించిన స్థానికులు ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రాధ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ఈ వార్తలు కూడా చదవండి

లక్కీ ఛాన్స్ వారిదే: భర్త ఎమ్మెల్యే, భార్య ఏకగ్రీవ సర్పంచ్

click me!