
ఘట్ కేసర్ లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన భార్యను ఏరకంగా హింసించిండో తెలిస్తే ఎంతటి వారైనా స్పందించక మానరు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ప్రియాంక (25)కు వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలోని రాంధాన్ తండాకు చెందిన రవితో 2005లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఇటీవల ఘట్ కేసర్ మండలంలోని అన్నోజిగూడ గ్రామంలో నివాసం ఉంటున్నారు.
గత కొంత కాలంగా రవి తన భార్యపై అనుమానంతో వేధింపులకు పాల్పడుతున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ప్రియాంక తన పుట్టింటికి వెళ్లింది. అయినప్పటికీ అక్కడికి వెళ్లి కూడా రవి ఆమెపై దాడిచేసి కొట్టాడు.
ఇటీవల ఒకసారి ప్రియాంక మర్మావయవాలపై కత్తితో గాట్లు పెట్టి హింసించాడు. ఇది చాలదన్నట్లు తనకు వేరెవరితో అక్రమ సంబంధం ఉందంటూ వైద్య పరీక్షలు జరిపించాడు. వేధింపులు తీవ్రమవుతున్న తరుణంలో ప్రియాంక తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.
ప్రియాంక ఆచూకీ కోసం తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రియాంక జనగాం లో ఉన్నట్లు గుర్తించారు. తీరా విచారణ చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.