ఖమ్మంలో పరువు హత్య
ఖమ్మం: కూతురు ప్రేమ వ్యవహరం నచ్చని తల్లిదండ్రులు ఉరేసి ఆమెను హత్చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకొంది. ప్రేమ విషయమై తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసుల విచారణలో మాత్రం కూతురును పరువు హత్యకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దేపూడికి చెందిన కోటమర్తి దీపిక అదే గ్రామానికి చెందిన జుంజునూరు వెంకటేశ్వర్ రావును ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన దీపిక కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. వీరిద్దరి ప్రేమను వారు అంగీకరించలేదు. అంతేకాదు ఈ విషయమై కూతురును తీవ్రంగా మందలించారు.కానీ ఆమె మాత్రం మారలేదు.
వెంకటేశ్వరరావుతో ప్రేమను కొనసాగిస్తోంది. అంతేకాదు వెంకటేశ్వరరావును వివాహం చేసుకొంటానని కూడ ఆమె తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది. ఈ వ్యవహరం నచ్చని దీపిక తల్లిదండ్రులు కూతురును వదిలించుకోవాలని ప్లాన్ చేశారు.
జూన్ 7వ తేదిన దీపిక అనుమానాస్పదస్థితిలో మరణించింది. ప్రేమ విషయంలో ఆమె పురుగుల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడిందని దీపిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. అయితే ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. వెంకటేశ్వరరావును దీపిక ప్రేమించడం ఇష్టం లేని దీపిక తల్లిదండ్రులు చున్నీతో ఉరేసి చంపేశారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెకు పురుగుల మందు తాగించారని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.