
తెలంగాణలో వైద్య, ఆరోగ్య రంగాన్ని పటిష్ఠం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. బాలికల పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు అడోలసెంట్ హెల్త్ కిట్లను(శానిటరీ హైల్త్ అండ్ హైజెనిక్ కిట్లు) పంపిణీ చేయనుంది. రూ. 69.52 కోట్లతో అడలోసెంట్ హెల్త్ కిట్ల కొనుగోలు, పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 14 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు ఈ హెల్త్కిట్ లబ్ధిదారులుగా ఉంటారు. విద్యార్థుల శానిటరీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కిట్ను పంపిణీ చేయనున్నారు. కిట్లో ఆరు శానిటరీ నాప్కిన్ ప్యాక్లు, వాటర్ బాటిల్, ఒక బ్యాగ్ ఉండనున్నాయి. ఈ పథకం ద్వారా దాదాపు 11 లక్షల మంది బాలికలకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కోసం11 లక్షల కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం 22 లక్షల కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ కార్యక్రమం అమలు చేస్తామని ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడు అమలు చేస్తోంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్ఎఫ్హెచ్ఎస్-5) నివేదిక ప్రకారం.. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతులలో దాదాపు 32 శాతం మంది శానిటరీ న్యాప్కిన్గా వస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో గర్భాశయ, మూత్రకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హెల్త్ అండ్ హైజీనిక్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 14 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న కౌమర బాలికలు రుతుక్రమం సమయంలో శుభ్రత పాటించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. దీంతో వారు ఆరోగ్యవంతంగా ఉండేందుకు, తద్వారా చదువుపై మరింత శ్రద్ధ చూపించేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్య కిట్ల పంపిణీ పాఠశాలలు, కళాశాలల్లో బాలికల హాజరును పెంచడంలో కూడా సహాయపడుతుంది.