
లక్ష ఉద్యోగాలు...
ప్రస్తుతం తెలంగాణలో చాలా వైరల్ గా మారిన పదం ఇది.
అధికార పార్టీకి తలనొప్పిగా, ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారిన ఆయుధం ఇది.
నిరుద్యోగ అభ్యర్థుల నుంచి తెలంగాణ రాజకీయ జేఏసీ వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ ఒక్క పదం గురించే అధికార పార్టీని నిలదీస్తున్నారు.
అసలు లక్ష ఉద్యోగాలు కావాలని ఏ నిరుద్యోగ అభ్యర్థి పోరాటం చేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఎన్నికల హామీలో భాగంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది.
ఆ ప్రకటనే గులాబీ పార్టీకి అధికారం దక్కడంలో కీలక పాత్ర పోషించింది.
ఇప్పుడు ఆ ప్రకటన చేసి మూడేళ్లుదాటుతోంది. కానీ, లక్ష ఉద్యోగాల్లో సగం కూడా భర్తీ చేయలేదని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు డీఎస్సీ అంటూ, గురుకుల నోటిఫికేషన్ అంటూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని వారు ప్రభుత్వంపై విరుచుకపడుతున్నారు.
అసలు ప్రభుత్వానికి నిజంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచనే ఉంటే ఇన్నాళ్లు ఎందుకు ఆగుతారు. యువత రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా ఎందుకు స్పందిచరు అని ప్రశ్నిస్తున్నారు.
కానీ, ప్రభుత్వం మాత్రం దీనికి తనదైన శైలిలో సమాధానం చెబుతోంది. గతంలోనే ఐటీ మంత్రి కేటీఆర్ తాము 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించారు. తాజాగా రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కూడా లక్ష ఉద్యోగాల ప్రకటనపై స్పందించారు.
ఈ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రంలో 42,449 ఉద్యోగాలను భర్తీ చేశామనీ, 2019లోపు కచ్చితంగా లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తిచేస్తామని స్పష్టంగా ప్రకటించారు.
అయితే ఏ ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు. అందులో పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేసినవెన్నీ, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినవెన్నీ తదితర విషయాలను మాత్రం తెలుపలేదు.
ఈ క్లారిటీ లేకపోవడం వల్లే తెలంగాణ రాజకీయ జేఏసీ తో పాటు నిరుద్యోగ అభ్యర్థులు జుట్టుపీక్కుంటున్నారు. కానీ, ఈటెల తో పాటు కేటీఆర్ అంతకు ముందు చాలా మంది టీఆర్ఎస్ నేతలు మాత్రం ఉద్యోగాల భర్తీ పై మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వీళ్లందరూ 40 వేలకు పైగా ఉద్యోగాలను ఎప్పుడో భర్తీ చేశామనే పదే పదే చెబుతూనే ఉన్నారు.
కాకపోతే ప్రొఫెసర్ కు, నిరుద్యోగులకు, ప్రతిపక్షాలకు మాత్రమే వారి లెక్కలు అర్థంకావడం లేదు.