తెలంగాణ అయ్యగార్లకు కేసిఆర్ తీపికబురు

Published : Sep 15, 2017, 02:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
తెలంగాణ అయ్యగార్లకు కేసిఆర్ తీపికబురు

సారాంశం

వచ్చే నవంబరు నుంచి ఉద్యోగుల మాదిరిగానే జీతాలు కొత్తగా ధార్మిక పరిషత్ ఏర్పాటుకు కేసిఆర్ నిర్ణయం 3వేల దేవాలయాలకు దీపదూప నైవేధ్యం

తెలంగాణలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న అయ్యగార్ల (అర్చకులు) కు కేసిఆర్ సర్కారు తీపి కబురు అందించింది. శుక్రవారం అర్చకులు తో సిఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి అర్చకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఉద్యోగులకు వచ్చే నవంబర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్ అమలు చేస్తామని సిఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1805 దేవాలయాల్లో అమలవుతున్న దూపదీప నైవేధ్యం పథకాన్ని అదనంగా మరో 3 వేల దేవాలయాలకు వర్తింపచేస్తామని సిఎం హామీ ఇచ్చారు. దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాలను పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేసినట్లు సిఎం వెల్లడించారు. దేవాలయాల నిర్వహణ సంబంధమైన అంశాలను పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా సిఎం వెల్లడించారు. మూడు నిర్ణయాలకు సంబంధించిన జీవోలను బ్రాహ్మణ సంఘం నాయకులకు,  అర్చకులకు ముఖ్యమంత్రి ఈ సమావేశంలోనే అందించారు. 

ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, టి. హరీష్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్, తుమ్మల నాగేశ్వర్ రావు, నాయిని నర్సింహరెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మికాంతరావు, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ఎమ్మెల్సీలు పురాణం సతీష్, కర్నె ప్రభాకర్, శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా దేవాలయాల మీద అతి ఎక్కువ అరాచకం జరిగింది. ప్రభుత్వాలు ఏ దేవాలయానికి ఒక్క ఎకరా భూమి కూడా ఇవ్వలేదు. దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనా, కబ్జాలకు గురైనా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. సమైఖ్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఈ అన్యాయం మరింత ఎక్కువగా జరిగింది. మన గుళ్లను గుళ్లుగా చూడలేదు. మన పుష్కరాలను పుష్కరాలుగా చూడలేదు. మన బతుకును బతుకుగా చూడలేదు. దేవాలయాల అభివృద్దిని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత దేవాలయాల అభివృద్ది పైనా, అర్చకుల సమస్యలపైనా, బ్రాహ్మణుల సంక్షేమం పైనా ప్రత్యేక దృష్టి పెట్టాము. ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాము. యాదాద్రి, దర్మపురి, వేములవాడ, బద్రాద్రి తదితర ఆలయాలను ఒక పద్దతి ప్రకారం అభృద్ది చేస్తున్నాము. గతంలో కేవలం 1805 దేవాలయాలకు నెలకు రూ.2500 మాత్రమే దూవదీప నైవేద్యం క్రింద ఇచ్చేవారు. దాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.6 వేలకు పెంచింది. దూపదీప నైవేద్యం క్రింద ఇప్పటినుండి మరో 3 వేల ఆలయాలకు నెలకు 6 వేల చొప్పున ఇస్తాం. దీంతో రాష్ట్రంలోని మొత్తం 4805 దేవాలయాలకు దూపదీప నైవేద్యం పథకం వర్తిస్తుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 

‘అర్చకులకు గౌరవ మర్యాదలు బాగానే లబించినా పూట గడవడమే కష్టంగా ఉంది. గుడిలో పూజలు చేసే అర్చకులకు పిల్లను కూడా ఇవ్వడానికి వెనకాడడంతో పెళ్లిల్లు కాని దుస్థితిలో ఉన్నారు. వారి జీత భత్యాలు ఆలయ కమిటీల మీదనో మరెవరి దయాదాక్షిన్యాల మీదనో ఆదారపడి ఉంది. ఇప్పటినుండి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అర్చకులు, ఇతర దేవాలయ ఉద్యోగులకు మొత్తం 5625 మందికి ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు అందుతాయి. ఉద్యోగుల స్థాయిని బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు చెల్లిస్తారు. నవంబర్ నెల నుంచి పే స్కేల్ అమలు చేస్తాము. ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి అమలు చేసినప్పుడు దేవాలయాల ఉద్యోగుల జీతాలు కూడా సవరిస్తాము’’ అని ముఖ్యమంత్రి అర్చకుల హర్షద్వానాల మద్య ప్రకటించారు. 

‘‘దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చేసే దుస్థితి పోవాలి. అందుకే ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించడానికి ఇకపై దేవాలయాల నిర్వహణ, తదితర వ్యవహారాలన్నీ పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పరిషత్ ఆధ్వర్యంలోనే ఇకపై దేవాలయాల నిర్వహణ ఉంటుంది. ఇప్పటికే బ్రాహ్మణుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయల నిధులతో ప్రత్యేక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేశాము. దీని ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాము. అర్చకులు, బ్రాహ్మణులకున్న ఇబ్బందులు, సమస్యలను పరిషత్ దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు. 

‘దేవాలయాల భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో 83వేల ఎకరాల భూములు దేవాలయాల ఆధ్వర్యంలో ఉన్నట్లు లెక్క ఉంది. ఈ భూమిని రక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అర్చకులు కూడా దేవాలయాల నిర్వహణ, దైవ సంబంధ కార్యక్రమాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. పొరపాట్లు కాకుండా చూడాలి. అర్చన బాగా చేస్తే భగవంతుడు కూడా మనల్ని దీవిస్తారు. ఉద్యమ సమయంలో మీరంతా బాగా పూజలు చేసి, ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు. ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందని కేసిఆర్ పేర్కొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్