ఆడియో టేపుల వివాదం: కుట్రలో ఎవరెవరున్నారో తేలాలన్న గంగుల

By narsimha lodeFirst Published Nov 17, 2019, 12:36 PM IST
Highlights

కరీంనగర్ జిల్లాలో రాజకీయాాలు వేడేక్కాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ మధ్య జరిగిన ఆడియో సంభాషణపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. 

కరీంనగర్: తనపై తప్పుడు కేసు పెట్టి అనర్హత వేటేసేందుకు కుట్ర జరిగిందని చెప్పేందుకు ఇంతకంటే  గొప్ప ఉదహరణలు ఉన్నాయా అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరెవరున్నారో బయటకు రావాల్సిన  అవసరం ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్.  ఆదివారం నాడు కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.

మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నికల ఖర్చు విషయమై (ప్రస్తుత కరీంనగర్ ఎంపీ) అప్పటి కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తనను ఓడించేందుకు కుట్ర జరిగిందని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు ఏముంటాయని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. దొడ్డిదారిన వేటు వేసేందుకు కుట్ర చేశారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. 

Also read:బయటపడ్డ సంచలన ఆడియో.. బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ మంత్రి ఫైర్

ఈ వివాదంపై తానేమీ మాట్లాడబోనని చెప్పారు. ఈ విషయాన్ని  ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత బండి సంజయ్ కలెక్టర్ సర్పరాజ్‌తో మాట్లాడినట్టుగా ఆ ఆడియోలో ఉంది. 

తాను కూడ మీడియాలో ప్రసారమైన ఈ ఆడియో గురించి విన్నట్టుగా  మంత్రి కమలాకర్ చెప్పారు. తనను ఓడించేందుకు ఇంత కుట్ర జరిగిందా అనే విషయం ఈ ఆడియో విన్న తర్వాత తనకు అర్ధమైందన్నారు. తనకు కుట్రలు కుతంత్రాలు తెలియవన్నారు.

తనను ఓడించేందుకు ఇంత కుట్రలు చేయాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ అనే వ్యక్తి రాజ్యాంగబద్దమైన హోదాలో ఉన్నారు.కలెక్టర్ అందరికీ సమన్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

ఎన్నికల వ్యయం ఎక్కువగా ఖర్చు చేసినందున ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటు వేసే అవకాశం గురించి కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి పోటీలో ఉన్న అభ్యర్థికి ఎలా సమాచారం ఇస్తాడని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.

ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.మేం ప్రజలను , సీఎంను, దేవుడిని నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా గంగుల కమలాకర్ చెప్పారు. కానీ, వీరంతా కుట్రలు, కుతంత్రాలపై ఆధారపడి పనిచేశారని ఆయన పరోక్షంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై ఆరోపణలు చేశారు.

ప్రజలు, సీఎం కేసీఆర్ బొమ్మతోనే  విజయం సాధించినట్టుగా గంగుల కమలాకర్ చెప్పారు. అయితే తనను ఓడించేందుకు జరిగిన కుట్రలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కుట్రలో ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఈ కుట్రలకు పాల్పడ్డారనే విషయాన్ని ఆయన ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు, చట్టం తన పని తాను చేసుకుంటూపోతోందని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. 

click me!