దుబ్బాక అసెంబ్లీ స్జానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి
సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ స్జానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 10వ తేదీన ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కానుంది.
సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్లను లెక్కించనున్నారు. కాలేజీలోని డీ బ్లాక్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు.
also read:దుబ్బాక బైపోల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల: గెలుపెవరిదంటే..
తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 200 మంది సిబ్బంది పాల్గొంటారు.
ఈ నెల 3వ తేదీన జరిగిన పోలింగ్ లో 1,64, 192 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని 315 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో 23 మంది బరిలో ఉన్నారు.
ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరపున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావులు బరిలో నిలిచారు.2018 ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది.