విబేధాలు కేసీఆర్ కుటుంబంలో లేవా?: డీకే అరుణ

First Published Jun 26, 2018, 12:57 PM IST
Highlights

కేసీఆర్‌పై జేజమ్మ తీవ్ర వ్యాఖ్యలు


గద్వాల: టీఆర్ఎస్ బలహీనంగా ఉన్నందునే  ఇతర పార్టీల నుండి బలమైన  నాయకులను  తమ పార్టీలో చేర్చుకొంటున్నారని మాజీ మంత్రి డీకే అరుణ సీఎం కేసీఆర్‌పై విరుచుకు పడ్డారు. 

మాజీ మంత్రి డీకే అరుణ మంగళవారం నాడు  మీడియాతో మాట్లాడారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్దంగానే ఉందని ఆమె చెప్పారు. టీఆర్ఎస్‌ పార్టీయే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని ఆమె  విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వారిని కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ప్రభుత్వంలో, పార్టీలో కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగానే ఉన్నామని ఆమె చెప్పారు. ఏ పార్టీలోనైనా విబేధాలు సహజమేనని ఆమె గుర్తు చేశారు. టీఆర్ఎస్‌లో విబేధాలు లేవా అని ఆమె ప్రశ్నించారు.కేసీఆర్ కుటుంబంలో కూడ విబేధాలు లేవా అని ఆమె ప్రశ్నించారు.

గద్వాల జిల్లాలో పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ రావడాన్ని ఆమె స్వాగతించారు.  పాలమూరు ప్రాజెక్టు పెండింగ్‌లో ఉండడానికి  జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కారణమని ఆమె ఆరోపించారు. 

click me!