
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల (bjp national executive meeting) సందర్భంగా అతిథులకు తెలంగాణ వంటకాలను రుచి చూపించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన వంటల స్పెషలిస్ట్ యాదమ్మను (yadamma) ఆయన పిలిపించారు. అయితే బీజేపీ సమావేశాలు జరుగుతున్న నోవాటెల్, హెచ్ఐసీసీ హోటల్ ప్రాంగణం వద్ద యాదమ్మను అడ్డుకున్నారంటూ నిన్న మీడియాలో కథనాలు రావడం సంచలనం సృష్టించింది. అయితే ఈ వార్తలను ఆమె ఖండించారు.
నోవాటెల్ వద్ద కొందరు తనను కింద కూర్చోబెట్టి ఫోటోలు తీశారని .. అప్పడు ఏదో సరదా పడుతున్నారని అనుకున్నానని, కానీ తర్వాతే వారి దురుద్దేశం తెలిసిందని యాదమ్మ అన్నారు. ఆ ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ నేతలు ట్విట్టర్ లో పోస్ట్ చేసి వివాదానికి తెరదించారు. కాగా.. పాస్ లేదంటూ నోవాటెల్ లోకి వెళ్లకుండా యాదమ్మను పోలీసులు అడ్డుకున్నారని, దీంతో ఆమె తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించారంటూ శనివారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ALso REad:ప్రధాని మోడీ కోసం ప్రత్యేకంగా పిలుపు.. వంట మాస్టర్ యాదమ్మకు అవమానం, నోవాటెల్ లోకి ‘‘ నో ఎంట్రీ ’’
ఇకపోతే.. గత 29 సంవత్సరాలుగా వంటలు చేయడంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించిన యాదమ్మ స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. 15 ఏళ్లకే పెళ్లి కావడంతో అత్తారిల్లు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ కు వచ్చేసి అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు చేయడం నేర్చుకుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలు చేయడంలో యాదమ్మ స్పెషలిస్ట్. కరీంనగర్ జిల్లా , ఆ చుట్టుపక్కల ఎంతో పేరు తెచ్చుకున్న యాదమ్మ.. ఇప్పుడు వీఐపీ చెఫ్ గా మారిపోయారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యక్రమాలతో పాటు రాజకీయ నేతల ఇళ్లల్లో జరిగే పలు వేడుకలకు యాదమ్మ వంటలు చేసేవారు. అలా ఆమె పేరు రాజకీయ వర్గాల్లోనూ మారుమోగింది.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించే సామూహిక కార్యక్రమాలకు యాదమ్మ చేతి వంటలనే రుచి చూపిస్తారు. చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో పర్వదినాల సందర్భంగా ఏర్పాటు చేసే సామూహిక భోజన కార్యక్రామానికి కూడా యాదమ్మ వంటలు చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అతిథులకు ఆమె చేతి రుచిని చూపించనున్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఆమెను హైదరాబాద్ కు రప్పించుకున్నారు. కొన్ని వంటకాలను చేయించుకున్న బండి సంజయ్ సూచనలు ఇచ్చారు. ఏకంగా దేశ ప్రధానికి తన చేతులతో చేసిన వంటకాలను రుచి చూపించనుండటంతో యాదమ్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల సందర్భంగా పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ కూ, సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పుగారెలు వంటి వటకాలను చేస్తామని యాదమ్మ తెలిపారు.