కువైట్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తెలంగాణ వాసులు

By Sree sFirst Published May 10, 2020, 6:55 AM IST
Highlights

కువైట్‌‌ లో చిక్కుకు పోయిన 167 మంది తెలంగాణ వాసులతో బయల్దేరిన ప్రత్యేక విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిన్న రాత్రి చేరుకుంది. ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వారిని క్వారంటైన్‌ కు తరలించారు.

హైదరాబాద్: కువైట్‌‌ లో చిక్కుకు పోయిన 167 మంది తెలంగాణ వాసులతో బయల్దేరిన ప్రత్యేక విమానం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిన్న రాత్రి చేరుకుంది. ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వారిని క్వారంటైన్‌ కు తరలించారు.

ప్రయాణికుల కోసం హోటళ్లు, రిసార్టులో  ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రయాణికులను గచ్చిబౌలిలోని ఒక హోటల్ కి‌, కాచిగూడలోని హర్ష హోటల్‌కు తరలించారు. విదేశాల నుంచి వచ్చేవారి  కోసం హైదరాబాద్‌లోని 29 హోటళ్లలో  పెయిడ్‌ క్వారంటైన్‌ కోసం ఏర్పాట్లు చేశారు. 

ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో 14 రోజులకు రూ.35వేలు, త్రీస్థార్‌ హోటళ్లలో రూ.15వేలు, సాధారణ హోటళ్లలో రూ.5వేలు ఫీజు నిర్ణయించారు. పేద కార్మికులకు ఉచితంగానే ప్రభుత్వం క్వారంటైన్ ఏర్పాట్లను చేయనుంది.  

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్‌ లో భాగంగా తెలంగాణ వాసులను స్వస్థలాలకు తరలించారు. ఇకపోతే.... తెలంగాణపై మరోసారి కరోనా పంజా విసిరింది. గత కొద్దిరోజులుగా చాలా తక్కువ కేసులు నమోదవుతుంటే ఈ మహమ్మారి బారినుండి తెలంగాణ మెల్లిగా బయటపడుతుందని అందరూ భావించారు. కానీ ఇంకా తెలంగాణ రాష్ట్రం కరోనా నుండి బయటపడలేదు. ఇవాళ(శనివారం) ఒక్కరోజే తెలంగాణలో 31పాజిటివ్ కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ గణాంకాలు మరోసారి తెలంగాణలో కలకలాన్ని సృష్టించింది. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇవాళ 30 కేసులు నమోదయ్యాయి. అలాగే  వలస కూలీ ఒకరికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  1163గా నమోదయ్యాయి. అయితే ఇప్పటికే  751 మంది డిశ్చార్జి అవ్వడంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 382గా వుంది. ఇవాళ ఒక్కరోజే మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో 30 కరోనా మరణాలు నమోదయ్యాయి. 

కరోనా వైరస్ పరీక్షలు తెలంగాణలో ఎక్కువగా నిర్వహించడంలేదని తెరాస ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాము సరిపోను టెస్టులు నిర్వహిస్తున్నామని, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే టెస్టులు నిర్వహిస్తున్నామని చెబుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే... తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరోనా వైరస్ టెస్టుల గురించి మాట్లాడుతూ.... కేసులు తక్కువగా నమోదవడానికి టెస్టులు చేయకపోవడానికి సంబంధంలేదని, కేసులు బయటపడకపోవడానికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి లేకపోవడం అని కొత్త సిద్ధాంతాన్నే చెప్పారు. 

click me!