కరోనా మృత్యుఘోష... గంటల వ్యవధిలో తండ్రీకొడుకుల మృతి

By Arun Kumar PFirst Published May 23, 2021, 9:32 AM IST
Highlights

 ఓ తండ్రీ కొడుకు కరోనాతో బాధపడుతూ కేవలం గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.  

కరీంనగర్: కరోనా మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలనే కబళించి వేస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే అనేక కుటుంబాలు బలయ్యాయి. తాజాగా ఓ తండ్రీ కొడుకు కరోనాతో బాధపడుతూ కేవలం గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.  

మానకొండూర్‌ మండలం చెంజర్ల గ్రామానికి చెందిన మూల తిరుమల్‌ (52) గీత వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతడి కొడుకు గిరి(30) కూడా ఇదే వృత్తి చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా వుండేవాడు. ఇలా ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలోకి కరోనా ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించింది.

ఈ తండ్రీ కొడుకు ఇద్దరు నాలుగు రోజుల క్రితం కరోనా బారినపడి చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. కాగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మొదట కొడుకు తిరుమల్‌ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.  అదేరోజు రాత్రి గిరి కూడా మృతిచెందాడు. ఇలా ఒకేరోజు ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

read more  కరోనా భయంతో... కన్న కూతురి అంత్యక్రియలకు ముందుకురాని తల్లిదండ్రులు

ఇదిలావుంటే తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 63,120మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 3308 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ 21 మంది మరణించగా... 4723 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 513 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 200లకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి.  

ఇప్పటి వరకు తెలంగాణలో 1.44 కోట్ల మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. 5,51,035 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 5,04,970 మంది కోలుకోగా.. 3106 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,959 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 91.64 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.

 జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 17, భద్రాద్రి కొత్తగూడెం 92, జగిత్యాల 91, జనగామ 36, జయశంకర్ భూపాల్‌పల్లి 42, జోగులాంబ గద్వాల్ 61, కామారెడ్డి 31, కరీంనగర్ 161, ఖమ్మం 228, కొమరంభీం ఆసిఫాబాద్ 24, మహబూబ్‌నగర్ 116, మహబూబాబాద్ 100, మంచిర్యాల 84, మెదక్ 48, మేడ్చల్ మల్కాజ్‌గిరి 203, ములుగు 49, నాగర్‌కర్నూల్ 90, నల్గొండ 98, నారాయణ్ పేట్ 25, నిర్మల్ 16, నిజామాబాద్ 60, పెద్దపల్లి 101, రాజన్న సిరిసిల్ల 30,  రంగారెడ్డి 226, సంగారెడ్డి 120, సిద్దిపేట 110, సూర్యాపేట 73, వికారాబాద్ 92, వనపర్తి 83, వరంగల్ రూరల్ 81, వరంగల్ అర్బన్ 116, యాదాద్రి భువనగిరిలో 91 చొప్పున కేసులు నమోదయ్యాయి. 
 

click me!