సీఎం సొంత జిల్లాలో మరో అన్నదాత ఆత్మహత్య... వైఎస్ షర్మిల ఆవేదన (Video)

By Arun Kumar PFirst Published Dec 14, 2021, 2:42 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతజిల్లాలో ఆత్మహత్య చేసుకున్న అన్నదాత చింతల స్వామి కుటుంబాన్ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. 

సిద్దిపేట: తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు (telangana farmers suicides) కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా (medak district)లో కరణం రవికుమార్ (karanam ravikumar) అనే రైతు ఆత్మహత్యను మరువకముందే తాజాగా సీఎం కేసీఆర్ (KCR) సొంత జిల్లా సిద్దిపేట (Siddipet)లో మరో రైతన్న బలవన్మరణానికి పాల్పడ్డాడు. వర్గల్ మండలం దండుపల్లి గ్రామానికి చెందిన రైతు చింతల స్వామి (chintala swamy) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (ys sharmila) పరామర్శించారు. 

రైతు చింతల స్వామి ఆత్మహత్య గురించి తెలిసిన వెంటనే YSRTP Chief  షర్మిల దండుపల్లికి చేరుకున్నారు. నేరుగా మృతిచెందిన రైతన్న ఇంటికి వెళ్లి బాధలో వున్న కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అండగా వుంటుందని షర్మిల భరోసా ఇచ్చారు. 

Video

దండుపల్లి గ్రామానికి చెందిన చింతల స్వామికి తండ్రి నుండి కొంత భూమి సంక్రమించింది. కుటుంబ అప్పులను తీర్చడానికి తండ్రి వ్యవసాయ భూమిని అమ్మగా 14గుంటల భూమి మాత్రమే మిగిలింది. ఈ భూమిని తన పేరిట చేయించుకోవాలని స్వామి గతకొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా ధరణి వెబ్ సైట్ లో నమోదు కావడంలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన అతడు  దారుణానికి ఒడిగట్టాడు. 

READ MORE  Telangana Farmer Suicide: వరి వద్దన్న సీఎం మనకు వద్దే వద్దు...: కేసీఆర్ పై వైఎస్ షర్మిల ధ్వజం

ఇంట్లో ఎవరూలేని సమయంలో చింతల స్వామి దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికివచ్చిన కుటుంబసభ్యులు స్వామి ఆత్మహత్యను గుర్తించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని అతడి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

రైతు చింతల స్వామి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఆవేదనను సూసైడ్ లెటర్ లో వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. 

ఇక ఇటీవల మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుమార్ కుటుంబాన్ని కూడా వైఎస్ షర్మిల పరామర్శించారు. అయితే షర్మిల పరామర్శ సందర్భంగా భూపతిపూర్ గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరామర్శ కోసం వచ్చిన షర్మిల బాధిత రైతు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్షకు కూర్చున్నారు. గ్రామస్తులు కూడా షర్మిలకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. 

READ MORE  మెతుకుసీమలో వరి రైతు ఆత్మహత్య... బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల (ఫోటోలు)

 పరామర్శకోసం వచ్చిన వచ్చిన షర్మిల హటాత్తుగా దీక్షకు కూర్చోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. భారీగా చేరుకున్న పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు, వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు కూర్చున్న షర్మిల చుట్టూ వలయంలా నిలబడి పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

 అయితే ఎట్టకేలకు షర్మిల వద్దకు చేరుకున్న చేరుకున్న పోలీసులు ఆమెతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో దీక్షను కొనసాగిస్తానని షర్మిల చెప్పడంతో బలవంతంగా ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడినుండి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా వుండేదుకే షర్మిలను అక్కడినుండి తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

click me!