
హైదరాబాద్: సీఎం కేసీఆర్ రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అని వివరించారు. కేసీఆర్ మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీని అందించగలిగిందని తెలిపారు. కాంగ్రెస్ పోరాటాలు, ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఇది సాధ్యమైందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, ఒత్తిళ్ల వల్లనే సీఎం కేసీఆర్ రైతులకు రుణమాఫీ ప్రకటించారని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కలిశారని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాదు, ఒక వేళ రుణమాఫీ చేయకుంటే బ్యాంకుల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించినట్టూ ఆయన గుర్తు చేశారు. ఎట్టకేలకు కేసీఆర్ మెడలు వంచి రుణమాఫీ డిమాండ్ను సాధించగలిగామని చెప్పారు.
Also Read: అన్నదాతలకు కేసీఆర్ గుడ్న్యూస్.. రేపటి నుంచి రైతు రుణమాఫీ, అధికారులకు కీలక ఆదేశాలు
అయితే, కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ నాలుగు సంవత్సరాలు ఆలస్యమైందని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఆలస్యం కారణంగా ఏర్పడిన వడ్డీలతో సహా రుణ మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వివరించారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అందే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు.
రైతు రుణమాఫీ ప్రక్రియను ఆగస్ట్ 3వ తేదీ నుంచి పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులకు మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీ జరగాల్సి వుందని.. రైతు బంధు తరహాలో విడతలవారీగా చేస్తూ, సెప్టెంబర్ రెండో వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.