
హైదరాబాద్ : హైదరాబాదులో ఓ దొం బాబా ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. ఓ యువతికి దయ్యం పట్టిందని, అది వదిలించాలంటే తనని పెళ్లి చేసుకోవాలంటూ చెప్పి, మోసానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దర్గాకు ఇన్చార్జిగా పనిచేస్తున్న షా గులాం నక్షాబంధీ హఫీజ్ పాషా (55) నిజస్వరూపం బట్టబయలవ్వడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇతను ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఏఎస్పేట (అనుమ సముద్రంపేట)కు చెందిన వ్యక్తి. ఇటీవలే రహమతుల్లా దర్గా ఇన్చార్జిగా వచ్చాడు.
ఇతనికి ఇప్పటికే ఇద్దరు భార్యలున్నారు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దర్గాకు ఇన్చార్జిగా ఉంటూనే దయ్యాలు, భూతాలు వదిలిస్తానంటూ పూజలు కూడా చేస్తాడు. ఈమధ్య కొద్ది కాలం కిందటే నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఏఎస్పేటలోని దర్గాకు నెలలో 4-5 రోజులు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలోని టోలిచౌకికి చెందిన ఓ 19 యువతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దర్గాకు వచ్చింది. ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెను రహమతుల్లా దర్గాకు తీసుకొచ్చారు. ఆ యువతిని చూసిన పాషా ఆమెకు దయ్యం పట్టింది అంటూ భయపెట్టాడు. ఆమెకు పట్టిన దయ్యం మామూలుది కాదని ప్రాణాలు తీసే వరకు వదలదని.. చావు నుంచి తప్పించుకోవాలంటే తనను పెళ్లి చేసుకోవాలని చెప్పాడు.
పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద దారుణం.. యువకుడిపై హత్యాయత్నం.. 15 మందిపై కేసు
తనకిచ్చి పెళ్లి చేయటం ద్వారా ఆ దయ్యాన్ని వదిలిస్తానని తేల్చి చెప్పాడు. దీంతో భయపడిన యువతీ కుటుంబ సభ్యులు గత్యంతరం లేక పాషా చెప్పిన దానికి ఒప్పుకున్నారు. శనివారం రాత్రి టోలిచౌకిలోని ఒక ఫంక్షన్ హాల్ లో పాషా చెప్పిన ప్రకారం పెళ్లికి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మండపానికి వస్తుండగా పాషాకు గుండెలో తేలికగా నొప్పి వచ్చింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, యువతి కుటుంబ సభ్యులకు పాషాకు అంతకుముందే పెళ్లిళ్లు అయిన సంగతి తెలియదు.
గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరడంతో అతని గురించి ఆరా తీయగా అతనికి అక్కడికి రెండు పెళ్లిళ్లు అయ్యాయని, ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసింది. ఇది తెలిసిన యువతి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తమను మోసం చేసి, యువతిని మూడో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడని వారికి అర్థమైంది. వెంటనే పాషా మోసం మీద పోలీసులను ఆశ్రయించారు. యువతితో కలిసి లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో అతని మీద ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.
ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే నిందితుడికి తెలంగాణకు చెందిన ఒక ప్రజా ప్రతినిధి కుటుంబానికి చెందిన ఓ సభ్యుడి అండ ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడిని విడిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. హఫీజ్ పాషా మీద ఇప్పటికే పలికేసులు ఉన్నాయి. నకిలీ బాబాగా అవతారం ఎత్తి వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 2012లో నకిలీ బాబా ముసుగులో తమిళనాడుకు చెందిన ఒక మహిళను పెళ్లి పేరుతో మోసగించాడు. శారీరకంగా వాడుకున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె మీద కక్ష కట్టి.. ఆమె ఇంట్లో హఫీజ్ పాషా తన అనుచరులతో గంజాయి ప్యాకెట్లు పెట్టించాడు. ఆమె ఒక్కతే కాదు మరో ఇద్దరు మహిళలు కూడా ఇతని బారిన పడి మోసపోయారు. వీరు కూడా తాజాగా నెల్లూరు జిల్లా పోలీసులను ఆశ్రయించారు.