
ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అకాల వర్షాలు, వడగళ్లతో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రైతులు, అనుచరులతో కలిసి పొంగులేటి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. పొంగులేటి అనుచరులను అడ్డుకున్నారు. కలెక్టరేట్ గేట్లను క్లోజ్ చేశారు. అయితే పొంగులేటి అనుచరులు కొందరు గేట్లు తోసుకుని కలెక్టర్లు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమ్మకు బువ్వపెట్టలేని.. అలాంటిది పినతల్లికి బంగారు గాజులు కొనిస్తారని చెబితే తెలంగాణ ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని చెప్పారు. రైతులు గోస కేసీఆర్కు తగులుతుందని అన్నారు.
రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా.. రాష్ట్రంలో ఎక్కడ ఏ రైతుకు కష్టమొచ్చిన తాను అక్కడ ఉంటానని, తనవంతు మద్దతు అందజేస్తానని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు నష్టం ఇవ్వాలని డిమాండ్ చేశారు.