తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలతో కలిసి కొందరు నేతలు పార్టీ పెడతారనేది అవాస్తవమన్న కొండా.. రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత జైలుకెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారని.. అయితే ఆమె అరెస్ట్ కాకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో అవగాహన వుందని ప్రజలు అనుకున్నారని కొండా పేర్కొన్నారు. దీని వల్లే తెలంగాణలో బీజేపీ ఉదృతికి బ్రేక్లు పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ - బీఆర్ఎస్లు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని ప్రజలు అనుకుంటున్నారని కొండా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీకి తెలంగాణలో పెద్ద సంకటంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకుల చేరికలు ఆగిపోయాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ విచిత్రమైన సంకట స్థితిలో వుందని ఆయన పేర్కొన్నారు. ఈటలతో కలిసి కొందరు నేతలు పార్టీ పెడతారనేది అవాస్తవమన్న కొండా.. రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా కొత్త పార్టీ ఆలోచన చేస్తే కేసీఆర్ పురిటిలోనే చంపేస్తారని విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.