
హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కేసుకు సంబంధించి సాహితీ ఇన్ఫ్రాతో పాటు సంబంధిత సంస్థలు, ప్రమోటర్లపై ఈడీ అధికారులు శనివారం సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని సాహితీ ఇన్ఫ్రా కార్యాలయాలు, అనుబంధ సంస్థలు, కీలక ప్రమోటర్ బి లక్ష్మీ నారాయణ నివాసాలపై ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. ఇక, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ గ్రూప్ కార్యాలయాలపై కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. సాహితికి ఫీనిక్స్ గ్రూప్లకు మధ్య ముఖ్యమైన భూమి లావాదేవీలు ఉన్నట్టుగా విచారణలో గుర్తించడంతో ఈడీ అధికారులు సోదాలు ఫీనిక్స్ గ్రూప్లో కూడా సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఓమిక్స్ ఇంటర్నేషనల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.
ఇక, స్థిరాస్తి పేరుతో మోసాలకు పాల్పడినట్టుగా సాహితీ ఇన్ఫ్రాపై అభియోగాలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో వినియోగదారులను రూ.1,500 కోట్లకు మోసం చేసి, ఫ్లాట్లను నిర్మించడంలో విఫలమైందని ఆ సంస్థ ఆరోపణలు ఎదుర్కొంటుంది. సాహితీ కేసులో లక్ష్మీ నారాయణతో పాటు ఇతర నిందితులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టింది.
ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కంపెనీ కొనుగోలుదారులను సాహితీ ఇన్ఫ్రా ఆకర్షించింది. అమీన్పూర్ వెంచర్కు సంబంధించి పోలీసులు ఆ సంస్థపై 46 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. ఇతర వెంచర్లలో కూడా ఇలాంటి ఆరోపణలను సంస్థ ఎదుర్కొంటుంది. అమీన్పూర్ ల్యాండ్ కేసులో సాహితీ సంస్థ.. ఫోనిక్స్ గ్రూప్తో లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. గతంలో ఈ కేసుకు సంబంధించి సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ బి లక్ష్మీ నారాయణను హైదరాబాద్కు సీసీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు.