ఓటుకు నోటు కేసులో రేవంత్ కి షాక్:చార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ

By narsimha lodeFirst Published May 27, 2021, 2:40 PM IST
Highlights

ఓటుకు నోటు కేసులో  కాంగ్రెస్ ఎంపీ  రేవంత్ రెడ్డిపై ఈడీ గురువారం నాడు ఛార్జీషీటు దాఖలు చేసింది. 


హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో  కాంగ్రెస్ ఎంపీ  రేవంత్ రెడ్డిపై ఈడీ గురువారం నాడు ఛార్జీషీటు దాఖలు చేసింది. ఏసీబీ చార్ఝీషీట్ ఆదారంగా ఎంపీ రేవంత్ రెడ్డిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  స్టీఫెన్‌సన్ కు రూ. 50 లక్షలు ఇస్తుండగా ఏసీబీకి రేవంత్ రెడ్డి చిక్కారు. మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్ తో  క్రాస్ ఓటింగ్  చేసేలా రేవంత్ రెడ్డి రాయబారం నడిపారని ఏసీబీ అభియోగం మోపింది . ఆ సమయంలో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డికి ఓటు వేసేలా  పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను  రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ ఆరోపించింది.  ఏసీబీ ఛార్జీషీట్ లో రేవంత్ రెడ్డి సహా పలువురి పేర్లను  ప్రకటించింది.ఏసీబీ  చార్జీషీట్ ఆధారంగా ఈడీ ఛార్జీషీట్ ను  దాఖలు చేసింది. 

also read:స్టీఫెన్‌సన్ కూతురు సాక్ష్యం వద్దు: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు

2015 మే 31వ తేదీన  స్టీఫెన్ సన్  వద్ద డబ్బు సంచులతో ఉన్న రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డితో పాటు  మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణన్ కీర్తన్ రెడ్డి, బిషఫ్ సెబాస్టియన్  పేర్లను కూడ  ప్రస్తావించింది. ఈ డబ్బును వేం నరేందర్ రెడ్డి తనయుడు కీర్తన్ రెడ్డి తెచ్చినట్టుగా ఏసీబీ, ఈడీ ఆరోపించింది. ఓటింగ్ జరిగిన తర్వాత దేశం విడిచిపోయేందుకు గాను రూ. 2 కోట్లను రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ ఆఫర్ ఇచ్చాడు. ఇందులో భాగంగా రూ. 50 లక్షలను ఇవ్వనున్నట్టుగా ఆఫర్ ప్రకటించినట్టుగా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడిన సంభాషణను కూడ ఏసీబీ రికార్డు చేసింది.  ఈ ఫోన్ సంభాషణను ఫోరెన్సిక్  ల్యాబ్ కు పరిశీలనకు పంపిన విషయం తెలిసిందే.
 

click me!