తెలంగాణ ఈఎస్ఐ స్కామ్: ఈడీ దూకుడు.. రూ.144 కోట్ల ఆస్తులు అటాచ్

By Siva KodatiFirst Published Nov 23, 2021, 5:53 PM IST
Highlights

తెలంగాణ ఈఎస్ఐ స్కామ్‌లో (telangana esi scam) ఈడీ దూకుడు (enforcement directorate) పెంచింది. 144 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో 131 ఆస్తులు వున్నాయి. ఇందులో 97 ఫ్లాట్స్, 6 విల్లాలు, 18 కమర్షియల్ షాపులను అటాచ్ చేసినట్లు పేర్కొంది.

తెలంగాణ ఈఎస్ఐ స్కామ్‌లో (telangana esi scam) ఈడీ దూకుడు (enforcement directorate) పెంచింది. 144 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో 131 ఆస్తులు వున్నాయి. ఇందులో 97 ఫ్లాట్స్, 6 విల్లాలు, 18 కమర్షియల్ షాపులను అటాచ్ చేసినట్లు పేర్కొంది. తెలంగాణ ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ విచారణ జరిపింది. మనీలాండరింగ్ (money laundering)కింద తాజాగా ఆస్తులను అటాచ్ చేసింది. 

ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి (devikarani) , శ్రీహరిబాబు, రాజేశ్వర్ రెడ్డి, కె పద్మ, నాగలక్ష్మీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్ , బెంగళూరు, నోయిడా, చెన్నైలలో ఆస్తులను జప్తు చేసింది. వీటిలో దేవికారాణికి సంబంధించిన రూ.6.28 కోట్ల నగలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. అంతేకాకుండా పెద్ద మొత్తంలో నగదును కూడా ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో భాగంగా దేవికారాణి పెద్ద మొత్తంలో అక్రమాలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

ALso Read:దేవికారాణితో కుమ్మక్కు.. బినామీ పేర్లతో ముకుంద రెడ్డి వ్యాపారాలు, వెలుగులోకి కొత్త విషయాలు

కాగా.. తక్కువ ధరకు దొరికే పరికరాలను కొనుగోలు చేసి... ప్రభుత్వం నుంచి అధిక ధరలు రాబట్టింది ఈ ముఠా. దేవికారాణి, ముకుందారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరిబాబులు కలిసి ఈ స్కామ్‌కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. హవాలా, మనీలాండరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు మళ్లీంచినట్లు ఈడీ గుర్తించింది. వీటిని పలు ఫార్మా కంపెనీలతో పాటు రియల్ ఎస్టేట్ వెంచర్‌లలోనూ పెట్టుబడులు పెట్టినట్లుగా నిర్థారించింది.

దేవికారాణి ఏకంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించింది. అలాగే పీఎంజే జ్యూయలరీలో పెద్ద మొత్తంలో నగలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఆస్తులతో పాటు నగల కొనుగోలు మొత్తం హవాలా ద్వారా చెల్లింపు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టైన మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి  కాంట్రాక్టర్ కంచర్ల శ్రీహరిబాబు, మాజీ కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి, నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఈడీ పలుమార్లు సోదాలు నిర్వహించింది. 
 

click me!