
తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొన్న మునుగోడు ఉపఎన్నిక ప్రచార పర్వం మరికొద్దిగంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున నిధులను ఇతరులకు పంపిణీ చేశారంటూ కోమటిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం విచారణ జరిపింది. కోమటిరెడ్డిపై అందిన ఫిర్యాదు నిరాధారమైనదని పేర్కొంది. దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని ఈసీ స్పష్టం చేసింది.
మునుగోడు ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ప్రచారంలో మాటల యుద్ధానికి తోడు.. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం పెద్ద దుమారం రేపింది. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మునుగోడులో ఓటర్లకు పంచేందుకు గాను బీజేపీ రూ.5.22 కోట్లను పలువురి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు వేసిన 23 బ్యాంక్ ఖాతాల వివరాలను ఈసీకి అందజేసింది టీఆర్ఎస్. ఈ 23 బ్యాంక్ ఖాతాలు మునుగోడులోనివేనని తెలిపింది.
ALso Read:మునుగోడు ఉపఎన్నిక : ఓటర్లకు పంచేందుకు నగదు డిపాజిట్లు, బీజేపీపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
అయితే బీజేపీ ముందు నుంచే టీఆర్ఎస్పై ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని ఇందులో భాగంగానే ఫామ్హౌస్ డ్రామా ఆడిందంటూ గురువారం సీఈవోకి ఫిర్యాదు చేసింది బీజేపీ నేత రచనా రెడ్డి బృందం. టీఆర్ఎస్ అక్రమాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అడ్డుకోలేకపోతోందని ఆరోపిస్తోంది. ఇప్పటికే తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయగా.. ఇటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు.
ఇకపోతే.. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో నకిలీ నోట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి ప్రదాన్ తీసుకెళ్లారు. ఇప్పటికే 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని, మరో 14 వేల ఓట్లు తొలగించాల్సి వుందని చెప్పారు. అలాగే మునుగోడు ఎన్నికలో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని ... ప్రభుత్వ వాహనాలను కూడా ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు ధర్మేంద్ర ప్రదాన్.