భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని, బహిరంగ ప్రకటనలు చేసే విషయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి వ్యవహరించాలని ఈసీ కేసీఆర్ ను హెచ్చరించింది. బిజెపిని ఉద్దేశించి కేసిఆర్ కరీంనగర్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు ఎన్నికల కమిషన్ కాషన్ నోటీసు జారీ చేసింది. మార్చి 17వ తేదీన చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆ నోటీసు జారీ చేసింది.
భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని, బహిరంగ ప్రకటనలు చేసే విషయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడి వ్యవహరించాలని ఈసీ కేసీఆర్ ను హెచ్చరించింది. బిజెపిని ఉద్దేశించి కేసిఆర్ కరీంనగర్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ అద్యక్షుడు ఎం. రామరాజు ఈసీకి ఏప్రిల్ 9వ తేదీన ఫిర్యాదు చేశారు. దానిపై ఈసీ కేసీఆర్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ కొన్ని ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలని ఈసీ అభిప్రాయపడింది.
విభిన్న కులాలు, సమూహాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా లేదా విద్వేషాలు సృష్టించే విధంగా మతపరమైన లేదా భాషాపరమైన రాజకీయ పార్టీ గానీ అభ్యర్థులు గానీ వ్యాఖ్యలు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఈసీ స్పష్టం చేసింది. ఈ నిబంధనను కేసీఆర్ ఉల్లంఘించారని స్పష్టం చేసింది.