
మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మండిపడ్డారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జర్నలిస్టులపై ప్రేమ వలకబోసిన ట్విట్టర్ పిట్ట.. వారిని కత్తితో పొడిస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
ఆంధ్రా ప్రాంత కార్పొరేట్ కంపెనీలు, గ్రాడ్యుయేట్ల ఓట్ల కోసమే వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ ఉద్యమంపై మంత్రి కేటీఆర్ ప్రేమ చూపిస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రైవేటీకరణ గురించి కేటీఆర్ మాట్లాడటం హ్యాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.
ఎన్నికలు వచ్చినప్పుడు కేంద్రంపై విమర్శలు చేయటం కేటీఆర్కు అలవాటుగా మారిందని రఘునందన్ రావు ధ్వజమెత్తారు. హరీష్రావు సిద్దిపేటకు మాత్రమే ఆర్థిక మంత్రా? లేక తెలంగాణ రాష్ట్రానికా అంటూ సెటైర్లు వేశారు.
ఉద్యోగులతో పీఆర్సీపై చర్చించి సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తే.. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మాట్లాడరు? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
దుబ్బాక, జీహెచ్ఎంసీలలో వచ్చిన ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పునరావృతమవుతాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీజేపీకి సమయం ఇవ్వకపోతే స్పీకర్ను కూడా నిలదీస్తామని రఘునందన్ రావు హెచ్చరించారు.
గాంధేయ మార్గంలోనే తమ హక్కును సాధిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం చేసిన సాయంపై సభలో చర్చకు సిద్ధమా అంటూ టీఆర్ఎస్ నేతలకు రఘునందన రావు సవాల్ విసిరారు.
మందబలంతో సభను నడిపితే కుదరదని.. నిరుద్యోగ భృతిపై సభలో ప్రభుత్వ వైఖరీని ఎండగడతామని ఆయన వెల్లడించారు. బైంసాలో అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి ఉంటే శాంతి భద్రతలు బాగుండేవని రఘునందనరావు అభిప్రాయపడ్డారు.