దుబాయ్ శేఖర్ వి, మనుషులను అమ్మిన బ్రోకర్ వి: కేసిఆర్ పై డికె అరుణ

By pratap reddyFirst Published Oct 6, 2018, 12:18 PM IST
Highlights

శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసిఆర్ డికె అరుణపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు ఆమె శనివారం కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్టర్ సమితి (టీఆరఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ కాంగ్రెసు నేత డికె అరుణ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసిఆర్ డికె అరుణపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు ఆమె శనివారం కౌంటర్ ఇచ్చారు.

దుబాయ్ కి మనుషులను అమ్మిన బ్రోకర్ కేసిఆర్ అని, దాంతో దుబాయ్ శేఖర్ గా పేరు పొందారని ఆమె అన్నారు. టిఆర్ఎస్ రాబందుల, రాక్షసుల పార్టీ అని ఆమె వ్యాఖ్యానించారు. రఘువీరా రెడ్డికి డికె అరుణ మంగళహారతులు పట్టారని కేసిఆర్ అన్నారు. దానికి కూడా డికె అరుణ ప్రతిస్పందించారు. రఘువీరా రెడ్డికి తాను మంగళహారతులు పట్టినట్లు రుజువుగా ఫొటోలు గానీ వీడియోలు గానీ ఉంటే బయటపెట్టాలని ఆమె సవాల్ చేశారు. 

గత నాలుగున్నరేళ్లుగా తన బండారం ఎందుకు బయటపెట్టలేదని ఆమె కేసిఆర్ ను అడిగారు. తానేమిటో గద్వాల ప్రజలకు తెలుసునని ఆమె అన్నారు. కేసిఆర్ బెదిరింపులకు భయపడేది లేదని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్ పాత్ర ఏమీ లేదని అన్నారు. 

నిమ్స్ కు వెళ్తే కేసిఆర్ దీక్ష బాగోతం ఏమిటో చెబుతారని ఆమె అన్నారు. కాంగ్రెసు లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ఆమె అడిగారు. కేసిఆర్ ఎంతటి మోసగాడో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. మతిస్థిమితం కోల్పోయి కేసిఆర్ మాట్లాడుతున్నారని అరుణ అన్నారు. 

కేసిఆర్ లో ఓటమి భయం కనిపిస్తోందని అన్నారు. ఓ శక్తి గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని కేసిఆర్ గుర్తించాలని ఆమె అన్నారు. ఏ మాత్రం సంస్కారం లేకుండా కేసిఆర్ మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. 

click me!