ఢిల్లీ లిక్కర్ స్కామ్.. రెండోసారి ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత.. పిళ్లైతో కన్​ఫ్రంటేషన్ చేస్తారా..?

By Sumanth KanukulaFirst Published Mar 20, 2023, 10:47 AM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు కవితను విచారించనున్నారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి కవిత‌తో పాటు ఆమె భర్త అనిల్, న్యాయవాది సోమా భరత్‌లు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కవిత ఒక్కరే విచారణ నిమిత్తం ఈడీ కార్యాయలయం లోనికి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సౌత్ గ్రూప్‌కు ప్రమేయం గురించి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కవితకు బినామీ అని అరుణ్ రామచంద్ర పిళ్లై చెప్పారని పేర్కొన్న ఈడీ.. అతడితో ఆమెకు గత వ్యాపార లావాదేవీలపై ఆరా తీసే అవకాశం ఉంది.

అయితే కవితను ఒంటరిగానే విచారిస్తారా? లేదా ఈ కేసులో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న హైదరాబాద్‌ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కన్​ఫ్రంటేషన్ విచారణ జరుపుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ కూడా ఈరోజు ముగియనుండటంతో.. ఈడీ అధికారులు ఎలాంటి వ్యుహాన్ని అనుసరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇక, ఈడీ ఆఫీసుకు బయలుదేరే  ముందు కూడా కవిత.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. 

ఇక, ఈ కేసుకు సంబంధించి కవిత.. తొలుత ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు సమన్లు  జారీ చేసిన.. కవిత ఆ రోజు విచారణకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 24కి సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా కవిత లేఖలో ప్రస్తావించారు. తాను వ్యక్తిగతంగా రావాలని సమన్లలోని ఎక్కడ పేర్కొనలేదని.. తన ప్రతినిధిగా భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపుతున్నానని చెప్పారు. సమన్లలో అడిగిన వివవరాలను కూడా భరత్ ద్వారా పంపుతున్నానని చెప్పారు. దీంతో భరత్ ఈడీ కార్యాలయానికి చేరుకుని.. ఈడీ అడిగిన వివరాలను సమర్పించారు. ఆ తర్వాత కవిత హైదరాబాద్ బయలుదేరి వచ్చేశారు.

అయితే ఈడీ ఈ నెల 20 మరోసారి విచారణకు రావాల్సిందిగా కవితకు నోటీసులు జారీచేసింది. దీంతో కవిత ఆదివారం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కవితో పాటు మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, పలువురు సన్నిహితులు కూడా ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న వారు అక్కడ కేసీఆర్ నివాసంలో బస చేశారు. 

click me!