
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇవాళ అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. అరుణ్ రామచంద్రపిళ్లై కవిత బినామీ అని ఆరోపించిన ఈడీ.. ఆమె చెప్పినట్లు పిళ్లై నడుచుకున్నాడని పేర్కొంది. తాను కవిత ప్రతినిధినని అరుణ్ అనేకమార్లు స్టేట్మెంట్ ఇచ్చాడని ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ స్థాపనలో పిళ్లై కీలకపాత్ర పోషించాడని.. అలాగే కాగితాలపై 3.5 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు చూపారని ఈడీ పేర్కొంది.
మొదటి నుంచి అరుణ్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని ఎన్ఫోర్స్మెంట్ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ గురించి అరుణ్ రామచంద్రపిళ్లై, కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ముందే తెలుసునని ఈడీ పేర్కొంది. అలాగే సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించినట్లు పిళ్లై విచారణలో చెప్పాడని ఈడీ తెలిపింది. ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్లో ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ తమకు దొరికిందని ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాంలో హవాలా కోణానికి సంబంధించి పిళ్లైని ప్రశ్నించాలని ఈడీ తన రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లైని మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ఎదుట ప్రవేశపెట్టింది . ఈ సందర్భంగా ఈడీ పలు అభియోగాలు మోపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతినిధిగా రామచంద్రపిళ్లై వ్యవహరించినట్లు పేర్కొంది. లిక్కర్ స్కాంలో విచారణకు సైతం సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. ఇండో స్పిరిట్లో రామచంద్రపిళ్లై భాగస్వామిగా వుండటంతో పాటు .. సమీర్ మహేంద్రుతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించాడని ఈడీ కోర్టుకు తెలిపింది.
రెండు రోజులుగా ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు రాత్రి అరుణ్ రామచంద్రపిళ్లైని అరెస్ట్ చేసినట్టుగా ఈడీ ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే 11 మంది అరెస్టయ్యారు. లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు తొలుత అరుణ్ రామచంద్ర పిళ్లైపై అభియోగాలు నమోదు చేశారు. ఈ విషయమై హైద్రాబాద్ కేంద్రంగా పలు దఫాలు సోదాలు నిర్వహించారు. అరుణ్ రామచంద్ర పిళ్లైకి చెందిన సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సమయంలో కీలక సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పిళ్లైకి చెందిన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్డ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది.. హైద్రాబాద్ శివారులోని రెండు కోట్ల విలువైన భూమిని ఈడీ అధికారులు అటాచ్డ్ చేస్తున్నట్టుగా తెలిపింది