దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు.. అపోలోకి తరలింపు, పరామర్శించిన చంద్రబాబు

By Siva KodatiFirst Published Jun 21, 2022, 8:43 PM IST
Highlights

ఎన్టీయార్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగ‌ళ‌వారం గుండెపోటుకు గుర‌య్యారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అపోలో ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు. 

సీనియర్ రాజకీయవేత్త, ఎన్టీయార్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు (daggubati venkateswara rao) మంగ‌ళ‌వారం గుండెపోటుకు గుర‌య్యారు. వెంటనే స్పందించిన కుటుంబ స‌భ్యులు హుటాహుటీన ఆయ‌న‌ను అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ద‌గ్గుబాటికి చికిత్స అందించిన వైద్యులు ఆయ‌న గుండెలో స్టెంట్‌ను అమ‌ర్చారు. ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే టీడీపీ (tdp) అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) హుటాహుటీన అపోలో ఆసుప‌త్రికి చేరుకున్నారు. ద‌గ్గుబాటిని ప‌రామ‌ర్శించి... ఆయన ఆరోగ్యంపై అపోలో ఆసుప‌త్రి వైద్యుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవరకు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ విబేధాలు చోటుచేసుకోవడం దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ పురంధశ్వేరికి మంచి ప్రాధాన్యత దక్కింది. యూపీఏ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరారు. 

అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ చెంచురాం ఆమె 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పర్చూర్ నుంచి వైసీపీ తరపును బరిలో నిలిచిన వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరావు, ఆయన కుమారుడు హితేష్ యాక్టివ్ పొలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు.

ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఘాటుగా స్పందించిన పురందేశ్వరి..  భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నించడంపై తీవ్రంగా మనస్తాపం చెందినట్లు పేర్కొన్నారు. తానూ, తమ సోదరి నైతిక విలువలతో పెరిగామని పేర్కొన్నారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. 

ఆ తర్వాత కొద్దిరోజులకు ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన నందమూరి అల్లుళ్లు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి  దంపతులు కలిసి ఫొటోలు దిగారు. పెళ్లి కుమార్తెకు.. అటు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇటు నారా భువనేశ్వరి, పురందేశ్వరి పక్కపక్కనే నిల్చుని ఫొటోలకు పోజులివ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 

click me!