మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు, ఇద్దరు మృతి

By Mahesh RajamoniFirst Published Dec 6, 2023, 6:22 PM IST
Highlights

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తుఫాను కార‌ణంగా తెలంగాణ‌లోని చాలా ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డ‌గా, ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు.
 

Telangana rains: మిచౌంగ్ తుఫాను కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు, ఒడిశా  భారీ వ‌ర్షాలు కురిశాయి. తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కుర‌వ‌గా, ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి జ‌ల్లుల నంచి మోస్తారు వ‌ర్షాలు ప‌డ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో గోడ కూలి దంపతులు మృతి చెందారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం తుఫాను తీరం దాటింది. దీంతో చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిశాయి.

వ‌ర్షాల కార‌ణంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయార‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ ఇంటి గోడ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతులను పుల్లయ్య(45), లక్ష్మి(38)గా గుర్తించారు. అదే జిల్లాలోని అశ్వాపురం మండలం భీమవరం గ్రామంలో భారీ వర్షానికి 40 గొర్రెలు మృతి చెందాయి. వంద‌ల ఎక‌రాల్లో పంటలు దెబ్బ‌తిన్నాయి. 

Latest Videos

భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలకు కొన్ని మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం, వైరా, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక, పాలేరు నియోజకవర్గాల్లో అధిక‌ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు చెందిన రెండు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి భారీ వర్షం అంతరాయం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్దుకూరు, అశ్వారావుపేటలో బుధవారం ఉదయం 7 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఇదే జిల్లాలో మరో ఐదు చోట్ల 21 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

కొత్తగూడెం జిల్లా పరిధిలోని చండ్రుగొండ, కొత్తగూడెం, చుంచుపల్లి, భద్రాచలం, దుమ్ముగూడెం, మణుగూరు, పాల్వంచ తదితర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వేంసూరు, మధిర, చింతామణి, బోనకల్, పెనుబల్లి, వైరా, కొణిజర్ల తదితర మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది.

click me!