బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనీయం.. కోమటిరెడ్డికి కాంగ్రెస్ ఓట్లే : మునుగోడు ఫలితంపై కూనంనేని

By Siva KodatiFirst Published Nov 6, 2022, 6:54 PM IST
Highlights

కమ్యూనిస్టుల మద్దతుతోనే తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు రాష్ట్ర సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. రాష్ట్రంలో పోటీ టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్యే వుంటుందని.. బీజేపీని ఓడించేందుకు కలిసి పనిచేసేందుకు వామపక్షాలు సిద్ధంగా వున్నాయన్నారు. 
 

వామపక్ష శక్తులన్నీ ఏకం కావాల్సిన ఆవశ్యకత మునుగోడు ఉపఎన్నిక ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో బీజేపీ ఓటమి ఒక్క రాజగోపాల్ రెడ్డికే కాదు, నరేంద్ర మోడీకి చెంపపెట్టు లాంటిదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, డబ్బులు వున్నాయి.. బీజేపీ అండ వుంది కాబట్టి గెలుద్దామని భావించారని కూనంనేని దుయ్యబట్టారు. కమ్యూనిస్టుల మద్దతుతోనే టీఆర్ఎస్ గెలిచిందని ఆయన తెలిపారు. 

తెలంగాణలో పాగా వేయాలని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని సాంబశివరావు ఆరోపించారు. గతంలో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను కూడా బీజేపీ ఈసారి గెలవలేదని ఆయన జోస్యం చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు లేకపోవడం వల్లే .. ఆ పార్టీ కేడర్ కోమటిరెడ్డికి ఓటు వేశారని కూనంనేని తెలిపారు. రాష్ట్రంలో పోటీ టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్యే వుంటుందని.. బీజేపీని ఓడించేందుకు కలిసి పనిచేసేందుకు వామపక్షాలు సిద్ధంగా వున్నాయన్నారు. ఎట్లి పరిస్ధితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనీయమని కూనంనేని స్పష్టం చేశారు. 

అంతకుముందు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ గెలుపు కోసం పనిచేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్, గులాబీ దండుకు నమస్కారాలు తెలియజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన వామపక్ష పార్టీల నాయకులకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. నల్గొండ గడ్డ మీద 12 సీట్లుకు 12 సీట్లు కట్టబెట్టినందుకు అక్కడి ప్రజలకు శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 

ALso REad:మునుగోడు తీర్పు మోదీ, అమిత్ షాల అహంకారానికి చెంపపెట్టు.. మంత్రి కేటీఆర్

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల అహంకారానికి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని.. ఆత్మహత్యలే ఉంటాయని రుజువైందన్నారు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఆరోపించారు. మునుగోడులో పోటీ చేసి తెరపై కనిపించింది రాజగోపాల్ రెడ్డి అని.. వెనకుండి నడిపించింది అమిత్ షానేనని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా భారీ మెజారిటీ రావాల్సి ఉండేదని.. కానీ బీజేపీ నాయకత్వం వందల కోట్ల రూపాయలు తరలించి మునుగోడులో అసాధారణ పరిస్థితిని సృష్టించిందని విమర్శించారు. డబ్బుతో ఓటర్ల గొంతు నొక్కాలని బీజేపీ చూసిందని ఆరోపించారు. ఓటర్లకు పంచేందుకు డబ్బు తీసుకొస్తూ పలువురు బీజేపీకి చెందిన వ్యక్తులు పట్టుబడ్డారని అన్నారు. 

పార్టీ మారిన  వెంటనే రాజగోపాల్ రెడ్డి  కంపెనీ ఖాతాలోకి రూ. 75 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వాహలా ఆపరేటర్ మాదిరిగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా కంపెనీ నుంచి ఓటర్ల ఖాతాల్లోకి రూ. 5 కోట్లపైగా ట్రాన్స్‌ఫర్ చేశారని తాము ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ప్రేక్షక పాత్ర వహించేటట్టు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 
 

click me!