మనీ మ్యాటర్.. మాట్లాడదామని పిలిచి దంపతుల కిడ్నాప్.. చిత్రహింసలు పెట్టి...

By telugu news teamFirst Published Aug 19, 2021, 8:01 AM IST
Highlights

నీ భర్త రమ్మంటున్నాడంటూ శ్రీకాంత్ భార్య అనిత, పిల్లలు శివాణి, నెలరోజుల పసికందు వెంకటేష్ ను సైతం తీసుకువచ్చి వారం రోజుల పాటు నిర్భందించారు.

డబ్బు లావాదేవీల విషయంలో వారికి గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామంటూ పిలించారు. నిజమనుకొని వెళ్లిన దంపతులను వారి పసిబిడ్డ సహా కిడ్నాప్ చేసి.. వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. ఈ సంఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... వీపనగండ్ల మండలం సంపత్ రావుపల్లి గ్రామానికి చెందిన మేకల చంద్రయ్య హైదరాబాద్ లో స్థిరపడి జీహెచ్ఎంసీలో తాగునీటి ట్యాంకర్ గుత్తేదారుడిగా పనిచేస్తున్నాడు. ట్యాంకర్ డ్రైవర్ గా సరూర్ నగర్ కు చెందిన శ్రీకాంత్ ను నియమించుకున్నాడు. అనంతరం శ్రీకాంత్ కూడా కొత్త ట్యాంకర్ కొనుగోలు చేసి జీహెచ్ఎంసీకి కాంట్రాక్ట్ తిప్పేవాడు.

డ్రైవర్ గా పనిచేసే సమయంలో శ్రీకాంత్ తనకు రూ.3.50 కోట్లు ఇవ్వాల్సి ఉందని అతనితో చంద్రయ్య గొడవపడ్డాడు. డబ్బు విషయమై మాట్లాడుకుందామంటూ చంద్రయ్య తన కారులో శ్రీకాంత్ ఈ నెల 11న సంపత్ రావుపల్లికి తీసుకువచ్చాడు. అనంతరం 12న నీ భర్త రమ్మంటున్నాడంటూ శ్రీకాంత్ భార్య అనిత, పిల్లలు శివాణి, నెలరోజుల పసికందు వెంకటేష్ ను సైతం తీసుకువచ్చి వారం రోజుల పాటు నిర్భందించారు.

హైదరాబాద్ నుంచి కిరాయి మనుషులను రప్పించి.. భార్యభర్తలను అతి దారుణంగా కొట్టారు. చిత్రహింసలకు గురిచేశారు. కాగా.. బాధితుల అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. బాధితులు బయటపడ్డారు. కాగా.. నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
 

click me!