హైదరాబాదులో పట్టపగలు యువతిపై ఆటో డ్రైవర్ కిడ్నాప్, రేప్ కట్టుకథనే

By telugu teamFirst Published Aug 19, 2021, 7:47 AM IST
Highlights

తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసి, తనపై అత్యాచారం చేశాడని యువతి చేసిన ఫిర్యాదు కేవలం కట్టుకథనే అని పోలీసులు తేల్చారు. ప్రియుడికి పెళ్లి నిశ్చయం కావడంతో ఆమె డ్రామా ఆడినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులో యువతిపై ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశారనే ఫిర్యాదును కట్టుకథగా పోలీసులు తేల్చేశారు. తాను పనిచేసే ప్రాంతానికి వెళ్లేందుకు తాను ఆటో ఎక్కానని, అయితే డ్రైవర్ దారి మళ్లించి తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. హైదరాబాదులోని సంతోష్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూసింది. తమ దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే, వారికి ఏ విధమైన ఆధారాలు కూడా లభించలేదు. తన ప్రియుడికి వివాహం నిశ్చయం కావడంతో దాన్ని చెడగొట్టేందుకు యువతి డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రియుడిని కేసులో ఇరికించేందుకు ఆమె ఈ కట్టుకథకు తెర తీసినట్లు గుర్తించారు. 

హైదరాబాదులోని సంతోష్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న యువతి (20) మైలార్ దేవ్ పల్లిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది. మైలార్ దేవ్ పల్లి వెళ్లడానికి బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తాను ఆటో ఎక్కానని, అయితే డ్రైవర్ ఆటోను దారి మళ్లించి నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లి తమపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసింది.  తనపై ముగ్గురు ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు కూడా యువతి తెలిపింది.

స్పృహ తప్పి పడిపోయిన తనను అక్కడే వదిలేసి ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడని ఆమె ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఆటో డ్రైవర్ కోసం గాలించారు. సంతోష్ నగర్ నుచి మైలార్ దేవ్ పల్లి, పహడీషరీఫ్ ప్రాంతాల్లోని సెల్ టవర్ల సిగ్నల్స్ ను విశ్లేషించారు. ఆటో డ్రైవర్లను కూడా విచారించారు.  

click me!