తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు వేలాది భక్తులు వస్తుంటారు. టీటీడీ వారి కోసం ఆన్లైన్, కౌంటర్ల ద్వారా దర్శన టికెట్లు జారీ చేస్తుంటుంది. అయితే మహబూబ్నగర్కు చెందిన శెట్టి చంద్రశేఖర్, ఆయన భార్య ఒక్కసారి శ్రీవారి సేవలో పాల్గొనాలనే కోరికతో పదిహేడు సంవత్సరాల పాటు పోరాడాల్సి వచ్చింది.2008 నవంబరులో వీరు తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్ర సేవల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో రూ. 21,250 చెల్లించి డీడీ పంపారు. కానీ చాలా కాలం గడిచినా సేవ అవకాశం రాలేదు. టీటీడీకి లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. చివరకు 2021లో ఒకసారి సేవ స్లాట్ కేటాయించారు. కానీ ఆ సమయంలో కరోనా కారణంగా సేవలు రద్దయ్యాయని టీటీడీ తెలిపింది. ప్రత్యామ్నాయంగా బ్రేక్ దర్శనం అందిస్తామని సమాచారం ఇచ్చింది.
అయితే దంపతులు అందుకు ఒప్పుకోలేదు.అంతేకాకుండా న్యాయపరంగా వెళ్తూ మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. ఈ కేసును పరిశీలించిన కమిషన్, నాలుగు రోజుల్లో సేవా అవకాశం కల్పించకపోతే రూ. 20 లక్షల జరిమానా విధిస్తామంటూ 2023 మే 8న తీర్పు ఇచ్చింది.ఈ తీర్పుపై టీటీడీ రాష్ట్ర కమిషన్కి అప్పీల్ చేసినా, వారు జిల్లా స్థాయిలోనే పరిష్కారం కోరాల్సిందిగా స్పష్టం చేశారు. తాజా విచారణ 2025 మే 15న జరిగింది. కమిషన్ న్యాయాధికారి, తీర్పు అమలు చేస్తారా లేదా జరిమానా చెల్లిస్తారా లేక జైలుకి వెళ్తారా అని టీటీడీని ప్రశ్నించారు.
ఈ క్రమంలో టీటీడీ స్పందించింది. చంద్రశేఖర్ దంపతులకు 2025 ఆగస్టు 14, 15 తేదీల్లో తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్ర సేవల్లో పాల్గొనేందుకు అవకాశమిచ్చింది. సేవా టికెట్లు న్యాయమార్గం ద్వారా అందజేశారు.ఇలాగా, దాదాపు 17 ఏళ్ల న్యాయపోరాటం అనంతరం చంద్రశేఖర్ దంపతులకు శ్రీవారి సేవ చేసే అవకాశం లభించింది.