
గిరిజన రిజర్వేషన్లపై (tribal reservation) పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam kumar reddy) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రతిపాదనను తాము కూడా అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ఆ తీర్మానం కేంద్రం మాకు చేరలేదని ఎందుకు అంటుందని ఆయన ప్రశ్నించారు. దిక్కుమాలిన ప్రశ్న వేశానంటూ హరీశ్ రావు (harish rao) అంటున్నారని.. వాళ్లకి దళితులు, బీసీలు, గిరిజనులు, మైనార్టీలు దిక్కుమాలినోళ్లుగా కనిపిస్తున్నారా అంటూ ఉత్తమ్ ఫైరయ్యారు.
కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని అంటున్నారని.. గిరిజన రిజర్వేషన్లపై కేసీఆర్ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అసలు విషయం తప్పుదోవ పట్టే విధంగా హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. 2014 తర్వాత సెంటు భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇవ్వలేదని ఉత్తమ్ మండిపడ్డారు. గిరిజనుల నుంచి పోడు భూముల్ని ప్రభుత్వం లాక్కుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి ట్రైబల్ యూనివర్సిటీ రాలేదని ఉత్తమ్ మండిపడ్డారు.
అంతకుముందు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం పచ్చి అబద్దాలు చెబుతుందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంపలేదని కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు (Bishweswar Tudu) అబద్దాలు ఆడి.. పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని అన్నారు. ఈ క్రమంలోనే బుధవారం కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడుపై టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ప్రివిలేజ్ నోటీసు (privilege motion) ఇచ్చారు. కేంద్రం తీరుకు నిరసనగా ఎంపీలు ఇవాళ లోక్సభలో ఆందోళన చేపట్టారు. గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంట్ను తప్పుదోవ పట్టించిన బిశ్వేశ్వర్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు.
అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్టాడారు. ఎస్టీ రిజర్వేషన్ పెంపుపై 2017లోనే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం జరిగిందన్నారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెంటనే కేంద్ర హోం శాఖకు పంపడం జరిగిందని తెలిపారు. తాము కేంద్రానికి పంపింది ప్రతిపాదన కాదని.. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లు అని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలిపారు. ఎస్టీల రిజర్వేషన్ను 6 నుంచి 10 శాతానికి పెంచాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు.
ఐదేళ్లుగా ఆ బిల్లు గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారని చెప్పారు. ఎన్నిసార్లు అడిగినా ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణ నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం ఇప్పుడు కేంద్రం చెప్పడం దారుణమన్నారు. కేంద్రంలోని బీజేపీకి తెలంగాణపై చాలా అక్కసు ఉందని టీఆర్ఎస్ ఎంపీలు అన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామని చెప్పారు.కేంద్ర మంత్రి ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్పారని అన్నారు. కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు.