
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సంగారెడ్డి జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. అయితే ఈ పాదయాత్రలో రాహుల్ ప్రజలతో మమేకమవుతున్నారు. చిన్నా, పెద్దా అందరినీ పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు రాహుల్ గాంధీ. బాలల్లో ఉత్సాహం నింపేందుకు ఆయన స్వయంగా బంతులేస్తూ క్రికెట్ ఆడారు. రాహుల్ గాంధీ బౌలింగ్ వేయగా... ఒక చిన్నారి బ్యాటింగ్ చేశాడు. టీపీసీసీ చీఫ్ రేవంత్, కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, జర్నలిస్టులు ఫీల్డింగ్ చేయడం విశేషం. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా కొలాహలం నిండింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALso REad:భారత్ జోడో యాత్ర : రాహుల్ పాదయాత్రలో అపశృతి, కిందపడిపోయిన గీతా రెడ్డి.. స్వల్పగాయాలు
ఇక, రాహుల్ పాదయాత్ర మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. మంగళవారం సాయంత్రం చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు. నెక్లెస్ రోడ్డులో జరిగి కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో సాగుతున్న రాహుల్ యాత్రలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. దీంతో పోలీసులు బందోబస్తు కోసం భారీగా సిబ్బందిని మోహరించారు.