
ఎమ్మెల్సీ ఎన్నికల (mlc elections) వేళ తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్థిక మంత్రి (telangana finance minister), టీఆర్ఎస్ (trs) అగ్రనేత హరీష్ రావుకు (harish rao) సంగారెడ్డి కాంగ్రెస్ (congress) ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) సవాల్ విసిరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో (medak) ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల కోట్ల చొప్పున 10 నియోజకవర్గాలకు 20 వేల కోట్లను స్థానిక సంస్థలకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా విడుదల చేస్తే తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పిస్తానని హరీష్ రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు.
నిర్మాలా జగ్గారెడ్డిని గెలిపిస్తే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు 20 వేల కోట్లు తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా ప్రజాప్రతినిధులపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన (ap bifurcation) తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధులకు పదవులు వచ్చాయని, కానీ వారికి పవర్ లేదన్నారు. పూర్వ మెదక్ జిల్లా నుంచి ఆర్ధికమంత్రి ఉన్నా నిధులు శూన్యమంటూ హరీశ్ రావుపై ఫైరయ్యారు. ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటారని జగ్గారెడ్డి ఆరోపించారు.
Also Read:తిరిగి ఎమ్మెల్సీగా ఏకగ్రీవం... తల్లితో కలిసి అష్టలక్ష్మి అమ్మవారికి కవిత ప్రత్యేక పూజలు
మెదక్లో కాంగ్రెస్కు 230 ఓట్లు ఉన్నాయని.. గెలిచే ఓట్లు లేకున్నా తన భార్య నిర్మలను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో పెట్టానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టాం కాబట్టే ఎంపీటీసీ, జడ్పీటీసీలతో హరీష్ రావు ఇప్పుడు మాట్లాడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. మరి రెండేళ్ల నుంచి హరీష్ రావు ఏం చేశారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండాలని.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టడం వల్లనే హరీష్ రావు తమ పార్టీ ఓటర్లకు ఫోన్లు చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ను గెలిపించి రాజా బతుకు బతుకుతారో.. టీఆర్ఎస్ను గెలిపించి బానిస బతుకు బతుకుతారో మీరే తేల్చుకోవాలంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన హితవు పలికారు.