
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి పద్మ, ఆమె కొడుకు సంతోష్.. కామారెడ్డిలో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కొందరు టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తల్లీకొడుకుల ఆత్మహత్యకు కారణమైన ఏడుగురిని తక్షణమూ అరెస్ట్ చేయాలని వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ లఖిలపక్షం నేడు రామాయంపేట పట్టణ బంద్కు పిలునిచ్చింది. దీంతో పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేశారు. బంద్ నేపథ్యంలోనే గొడవలు జరగకుండా రామాయంపేటలో పోలీసులు భారీగా మోహరించారు.
ఇక, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే నేడు రామాయంపేటకు వెళ్లననున్నారు. ఈ రోజు సాయంత్రం రామాయంపేటకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, బంద్లో పాల్గొననున్నట్టుగా జగ్గారెడ్డి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు, మీడియాకు ఆయన సమాచారం ఇచ్చారు.
జిల్లా డీసీసీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఇతర నాయకులతో పాటు రామాయంపేటకు వెళ్తున్నట్టుగా చెప్పారు. టీఆరెస్ నాయకుల వేధింపులకు ఎవరు చనిపోవద్దని భరోసా ఇచ్చి.. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చి వస్తానని తెలియజేశారు. రామాయం పేట వెళ్తున్నానని.. ఆ సమాచారం ముందుకు చెబుతున్నానని పేర్కొన్నారు.
ఇక, పద్మ, సంతోష్లు ఇటీవల కామారెడ్డిలోని లాడ్జ్లో రూమ్ తీసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. తల్లి, కొడుకు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోను ఫేస్బుక్లో పెట్టినట్టుగా డీఎస్పీ వెల్లడించారు. మరోవైపు పోలీసులు సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, తాము ఆత్మహత్య చేసుకోవడానిక ఏడుగురు కారణమని మృతులు సూసైడ్ నోటులో పేర్కొన్నారు. తాము చనిపోవడానికి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేధింపులే కారణమని ఆరోపించారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని బెదిరింపులకు గురిచేశారని సంతోష్ వీడియోలో చెప్పారు.
‘శ్రీను అనే వ్యక్తితో కలిసి నేను వ్యాపారం చేశాను. శ్రీను వద్ద డబ్బులు లేకపోతే జితేందర్ గౌడ్ ఇచ్చాడు. తర్వాత వ్యాపారంలో 50శాతం వాటా కావాలని జితేందర్ గౌడ్ కోరాడు. అయితే డబ్బులు లేవని చెప్పడంతో.. ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నన్ను పీఎస్కు పిలిచారు. నా ఫోన్ను అప్పటి సీఐ నాగార్జున గౌడ్ తీసుకున్నాడు. నన్ను కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారు’ అని సంతోష్ వీడియోలో పేర్కొన్నాడు.
మున్సిపల్ చైర్మన్తో కలిసి అప్పటి రామాయం పేట సీఐ నాగార్జున గౌడ్ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వెనక్కి తగ్గారని.. ఏడాది పాటు తనను వేధించారని చెప్పాడు. తన వ్యాపారం జరగకుండా చేశారని సంతోష్ సెల్పీ వీడియోలో తెలిపాడు. దీంతో తాను అర్థికంగా నష్టపోయానని.. అప్పులు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని అన్నాడు. వీడియోలో తల్లి, కొడుకులు కన్నీరు పెట్టుకుంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ వీడియో కన్నీరు పెట్టించేలా ఉంది.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకన్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మరణ వాంగ్మూలం మేరకు చర్యలు తీసుకోవడం లేదంటూ మృతుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేయడం సరికాదని అంటున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.