
న్యూఢిల్లీ: సీఎం KCR తో కలిసి పనిచేయడం చాలా కష్టమని తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan చెప్పారు.మంగళవారం నాడు New Delhi లో ఆమె ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. తాను ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇద్దరూ కూడా భిన్నమైన వారేనన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎంలు నియంతృత్వంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. తనను మరో రాష్ట్రానికి పంపుతున్నారనేది వాస్తవం కాదన్నారు. తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ని కాదన్నారు.గవర్నర్ గా ఎవరున్నా కూడా ప్రోటోకాల్ పాటించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.రాజ్ భవన్ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదన్నారు. ఏ విబేధాలున్నా చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్ తమిళిసై చెప్పారు.
నిన్న కూడా టీఆర్ఎస్ నేతలపై ఆమె మండిపడ్డారు. పాత వీడియోలతో తనను ట్రోల్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు Telangana Governor తమిళిసై సౌందర రాజన్ న్యూఢిల్లీకి వచ్చారు. ఓ కేంద్ర మంత్రి కొడుకు వివాహనికి హజరయ్యేందుకు ఆమె న్యూఢిల్లీకి వచ్చారు.ఈ నెల 6వ తేదీనే ప్రధాని నరేంద్ర మోడీ, ఈ నెల 7న కేంద్ర మోంశాఖ మంత్రి అమిత్ షా ను ఆమె కలిశారు. ఈ ఇద్దరితో భేటీ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తనను అవమానపరుస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారంగానే తాను నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. కానీ అలా చేయడం టీఆర్ఎస్ సర్కార్ కు ఇబ్బందిగా మారితే తాను ఏం చేయలేనన్నారు. కేసీఆర్ ను తాను సోదరుడిగా భావించానన్నారు. కానీ తనను అవమానిస్తున్నారన్నారు. రాజ్ భవన్ కు ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలన్నారు. గవర్నర్ చేసిన విమర్శలకు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు.
గత కొంతకాలంగా తెలంగాణలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య దూరం పెరిగింది. ఈ విబేధాలు ఇటీవల తారాస్థాయికి చేరకున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో కౌశిక్ రెడ్డిని పేరును కేబినెట్ సిఫారసు చేయగా.. గవర్నర్ దానికి ఆమోదం తెలుపలేదు. అప్పటి నుంచి గవర్నర్కు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతూ వస్తుంది. రాజ్ భవన్లో గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకాలేదు.
సమక్క సారక్క జాతరలో పాల్గొనడానికి వెళ్లిన గవర్నర్కు ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఆహ్వానించడానికి రాలేదు. దీంతో ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వినిపించాయి. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఇప్పటికే కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. గవర్నర్ తమిళిసై హన్మకొండ, యాదాద్రి పర్యటనల సందర్భంగా మంత్రులు, అధికారులు ప్రోటోకాల్ పారించలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిణామాలపై తమిళిసై వివిధ సందర్భాల్లో బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు.
తాజాగా రాజ్భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులను హాజరుకాలేదు. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ హోదాలో తన పరిమితులు ఏంటో తనకు తెలుసునన్నారు. తనను ఎవరూ నియంత్రించలేరని తమిళిసై వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి ఇగో లేదని.. ప్రజల సమస్యల కోసం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. అందరితో సఖ్యతగా వుండటమే తనకు తెలుసునని తమిళిసై పేర్కొన్నారు. రాజ్భవన్ తెలంగాణ ప్రజల మేలు కోసమే వుందన్నారు. వచ్చే నెల నుంచి రాజ్భవన్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని తమిళిసై వెల్లడించారు.