ఠాగూర్ చెప్పే వరకు చూస్తా, నా నోటికి తాళం వేయలేరు: జగ్గారెడ్డి

Published : Jan 06, 2022, 06:01 PM IST
ఠాగూర్ చెప్పే వరకు చూస్తా, నా నోటికి తాళం వేయలేరు: జగ్గారెడ్డి

సారాంశం

తాను ఐదు రోజుల్లో రాజీనామా చేయబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై సంగారెడ్డి కాంగ్రెసు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెసు తన జాగీరో, రేవంత్ రెడ్డి జాగీరో కాదని ఆయన అన్నారు.

హైదరాబాద్: తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వచ్చిన వార్తలపై సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి స్పందించారు. మీడియాలో వచ్చిన వార్తలను ఆయన ఖండించలేదు, అలాగని సమర్థించనూ లేదు. దీంతో ఆయన తన భవిష్యత్తు కార్యాచరణపై సందిగ్ధంలో పెట్టారు. అయితే, తాను కాంగ్రెసు పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ గా కూడా తాను కాంగ్రెసుతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. జగ్గారెడ్డి ఐదు రోజుల్లో రాజీనామా చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దానిపై ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ తో తన ఆవేదనను చెప్పుకున్నానని, ఆయన చెప్పే వరకు వేచి చూస్తానని Jagga Reddy చెప్పారు. సమన్వయం చేసే మార్గంలోనే Mavickam Tagore ఉన్నట్లు కనిపించారని చెప్పారు. కమిటీలో తాను ఏం మాట్లాడననేది చెప్పలేనని అన్నారు. ఏదైనా రాయడానికి మీడియాకు స్వేచ్ఛ ఉందని, మీడియాకు అనుమానాలు వచ్చాయి కాబట్టి రాసిందని, మీడియాకు ఆ స్వేచ్ఛ ఉందని ఆయన అన్నారు. తాను చెప్పలేదు కాబట్టి ఆ వార్తలను తాను ఖండించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన నోటికి రాష్ట్ర కాంగ్రెసు నేతలు ఎవరు కూడా తాళం వేయలేరని చెప్పారు. Sonia Gandhi, Rahul gandhi మాత్రమే తన నోటికి తాళం వేయగలరని అన్నారు. తన వైఖరి కాంగ్రెసు అని చెప్పారు. 

ఈ నెల 20వ తేదీ తర్వాత ఢిల్లీ వెళ్లి అధిష్టానం నేతలతో మాట్లాడుతానని, ఆ తర్వాతే ఏదైనా చెప్తానని ఆయన అన్నారు. పార్టీకి నష్టం కలిగించే విషయాలు ఏవీ మాట్లానని అన్నారు. తాను కాంగ్రెసులోనే ఉంటానని ఆయన చెప్పారు. తాను బిజెపిలో గానీ టీఆర్ఎస్ లో గానీ చేరబోనని, అవసరమైతే ఇండిపెండెంట్ గానే ఉంటానని, ఇండిపెండెంట్ గా కూడా తాను సోనియా, రాహుల్ గాంధీలనే సమర్థిస్తానని చెప్పారు.  పార్టీలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని సోనియా గాంధీతో చెబుకుంటానని జగ్గారెడ్డి చెప్పారు. తనది సూటిగా మాట్లాడే అలవాటుఅని ఆయన అన్నారు. తనకు పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ బాద్యతలు అప్పగించిందని, తాను బాధ్యతగా వ్యవహరిస్తానని చెప్పారు. 

సోనియా, రాహుల్ గాంధీల మార్గంలో, ఆ తర్వాత ప్రియాంక గాంధీల మార్గంలో నడుచుకోవడం తనకు ఇష్టమని ఆయన చెప్పారు. రాజకీయంగా, అంతర్గతంగా వంద ఉంటాయని, కానీ తాను పార్టీకి నష్టం చేయాలని చూడబోనని అన్నారు. తనను ఏ పార్టీ అయినా ఆహ్వానించిందా, లేదా అనేది కూడా తాను చెప్పబోనని అన్నారు. పార్టీకి దూరం కావాలని తాను అనుకోవడం లేదని, తనతో పాటు తన భార్య, కూతురు, కుమారుడు కూడా కాంగ్రెసుతోనే ఉంటారని అన్నారు. ఎవరెన్ని రాసుకున్నా, ఎవరెన్ని అపనిందలు వేసినా, వ్యక్తిగతంగా పార్టీకి నష్టం చేయబోనని అన్నారు. జీవితాంతం కాంగ్రెసులోనే ఉంటానని చెప్పారు. అధిష్టానానికి తెలియకుండా తాను తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోనని అన్నారు. తనతో విహెచ్, మధుసూదన్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో పాటు పలువురు పార్టీ నాయకులు మాట్లాడారని అన్నారు. తమ పార్టీ నాయకులంతా తనతో మాట్లాడారని అంటూ ఎవరు ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారనేది తాను చెప్పదలుచుకోలేదని జగ్గారెడ్డి అన్నారు. 

తనను సస్పెండ్ చేస్తారని మీడియా ఊహాగానాలు ప్రచారం చేస్తోందని, అయినా తనను ఎందుకు సస్పెండ్ చేస్తారని, కాంగ్రెసు పార్టీ సోనియా రాహుల్ గాంధీల సొత్తు అని, వేరెవరి సొత్తూ కాదని అన్నారు. కాంగ్రెసు పార్టీ తన జాగీరు కాదు, రేవంత్ రెడ్డి జాగీరూ కాదని అన్నారు. ఏది మాట్లాడినా పార్టీకి నష్టం జరగకుండా మాట్లాడుతానని ఆయన చెప్పారు. తన గురించి అందరూ ఎందుకు మాట్లాడుతున్నారనేది 20వ తేదీ తర్వాత అధిష్టానం కలిసి వచ్చిన తర్వాత మాట్లాడుతానని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu