
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి కొద్దిరోజులుగా పార్టీలో యాక్టివ్గా ఉండటం లేదనే సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగిస్తుంటే.. జగ్గారెడ్డి మాత్రం తనశైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలితో పాటు, పార్టీలో పరిణామాలపై ఎప్పటికప్పుడు మీడియా ముందు ప్రస్తావించే.. జగ్గారెడ్డి గత కొంతకాలంగా మౌనం పాటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా పాల్గొనడం లేదు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా జగ్గారెడ్డి వ్యవహార శైలి తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయన కేటీఆర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలతో సఖ్యతగా ఉండటం కనిపించింది.
ఇప్పటికే గత కొంతకాలంగా జగ్గారెడ్డి పార్టీ మారడానికి సిద్దమయ్యారనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సమావేశం తర్వాత ఆయన వైఖరి కొంత మారినట్టుగా కనిపించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగ్గారెడ్డి వ్యవహరించిన తీరు తర్వాత మరోసారి ఈ ప్రచారం ఊపదుకుంది. అయితే వాటిని జగ్గారెడ్డి ఖండించడం లేదు. దీంతో ఆయన పార్టీ మారనున్నారనే ప్రచారానికి బలం చేకూరినట్టయింది.
మరోవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తాను పనిచేయలేనని జగ్గారెడ్డి సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా సీనియర్లకు పార్టీలో గౌరవం దక్కడం లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. అయితే జగ్గారెడ్డి వ్యవహార శైలిని దగ్గరగా పరిశీలిస్తున్నవారు.. ఆయన బీఆర్ఎస్లో చేరేందుకు సిద్దమయ్యారని.. ఈ మేరే ఆ పార్టీ అధిష్టానానికి సంకేతాలు కూడా పంపారని చెబుతున్నారు.
జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకుంటే.. బీఆర్ఎస్కు సంగారెడ్డిలో బలమైన నేత లభించినట్టుగా అవుతుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జగ్గారెడ్డి పార్టీ మార్పుకు సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది.