మున్సిపల్ ఎన్నికల వాయిదా... హైకోర్టును ఆశ్రయించిన షబ్బీర్ అలీ

By Arun Kumar PFirst Published Apr 19, 2021, 1:23 PM IST
Highlights

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.  

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోడానికి కాంగ్రెస్ నాయకులు షబ్బీర్అలీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ పిటిషన్ పై  హైకోర్టు విచారించనుంది. 

ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్లతో పాటు  ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం గత గురువారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ల పాలకవర్గం కాలపరిమితి ముగిసింది. దీంతో  కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

అలాగే అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట నకిరేకల్ మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీగా ఉన్న ఒక్క వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 16వ తేదీ నుండి నామినేషన్లను స్వీకరణ ప్రారంభమై 18వ తేదీ వరకు కొనసాగింది. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మే 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. 

వరంగల్ లో 66, ఖమ్మం 60 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ముద్రణతో పాటు వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను కూడ పూర్తి చేశారు. గతంలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఈ  పాలకవర్గాల పదవీకాలం ముగియని కారణంగా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేయాలని షబ్బీర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. 

click me!