
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దవుతుందని.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పిలునిచ్చారు. గ్రూప్ రాజకీయాలు చేయవద్దని కార్యకర్తలను కోరారు. నియోజకవర్గాల్లో ఇద్దరు సమాన స్థాయి నాయకులు ఉంటే.. ఒకరికి ఎమ్మెల్యే టికెట్.. మరొకరికి ఎమ్మెల్సీ లేదా జెడ్పీ చైర్మన్ ఇప్పించే బాధ్యత పార్టీ సీనియర్ నేతగా తాను తీసుకుంటానని చెప్పారు.
ప్రతి పార్టీలో గ్రూప్లు ఉంటాయని.. కాంగ్రెస్ పార్టీలో అందరం కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్లో గుత్తా సుఖేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డిలు కడుపులో కత్తులు పెట్టి పొడుసుకోవడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్లో కూడా గ్రూపులు ఉన్నాయని విమర్శించారు.
సీనియర్ నేతగా ఉన్న తనకు పీసీసీ దక్కకపోవడంపై కొన్ని రోజులు బాధపడ్డ మాట వాస్తవేమని అన్నారు. ప్రస్తుతం తాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలతో కలిసి పనిచేస్తున్నట్టుగా చెప్పారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అండగా ఉంటున్నానని తెలిపారు. ఏ పదవి అయినా ఒక్కటే ఉంటుందని.. ఒకరికే వస్తుందని.. ఇంకోసారి మరొకరికి అవకాశం వస్తుందని అన్నారు.
తెలంగాణలో నాలుగు కోట్ల మంది బాగుంటారని చెప్పి... ఏపీలో పార్టీ నష్టపోయిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పదో తేదీ వచ్చిన కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు.