
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. ఇవాళ తమ పార్టీ అభ్యర్ధికి బీ ఫామ్ అందించనుంది.గత ఏడాది డిసెంబర్ మాసంలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరిగియి. ఈ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్ధిగా ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించారు. ప్రమాణం చేయకముందే ఆయన అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ఈ స్థానం నుండి పోటీ చేయవద్దని బీజేపీ నేతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూడాలని బీజేపీ నేతలు కేటీఆర్ ను కోరారు. ఈ విషయమై కేటీఆర్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడ ఇదే విషయమై కోరారు.
అయితే ఈ స్థానం నుండి పోటీ చేస్తామని మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీ అనుమతి లేకుండా ఈ విషయమై కేటీఆర్ ను కలవడంపై కొందరు నేతలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. ఈ విషయమై ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేపటిలోపుగా నివేదిక అందించనుంది. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా కొందరు నేతలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.